Emergency Fund | రాజేంద్ర ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగి. తల్లిదండ్రులు, భార్య, ఇద్దరు పిల్లలున్నారు. కుటుంబానికి రాజేంద్రే పెద్ద దిక్కు. నెలాఖర్లో క్రెడిట్ కార్డులపైనే సంసారం సాగేది. ఎలాగోలా నెట్టుకొస్తున్న తరుణంలో ఉద్యోగం అసౌకర్యంగా అనిపించడం మొదలైంది. మరో ఉద్యోగం చూసుకుందామనుకున్నా, ఏదైనా వ్యాపారం మొదలు పెడదామనుకున్నా చేతిలో చిల్లర తప్ప ఏమీలేని దుస్థితి.
నిజానికి ఇది రాజేంద్ర ఒక్కరి కష్టమే కాదు.. మనలో చాలామందిదీ దాదాపుగా ఇదే పరిస్థితి. రేపటి కోసం ప్లానింగ్ లేకుండా, ఎప్పటికప్పుడు ఏ నెలకానెల సాగించుకుంటూ ముందుకెళ్లడం వల్లే ఇదంతా. ధైర్యం చేసి ఒక్క అడుగు ముందుకేయలేక.. అక్కడే ఇమడలేక యాతన పడుతున్న ఉద్యోగులెందరో. అందుకే అత్యవసర నిధి అందరికీ ఆవశ్యకం. అయినా మనలో 75 శాతం మందికి ఎమర్జెన్సీ ఫండ్స్ లేవని ఓ తాజా సర్వేలో తేలడం తప్పక గమనించదగ్గ అంశమే.
మనకు అత్యవసర పరిస్థితుల్లో పనికొచ్చే నిధే ఈ ఎమర్జన్సీ ఫండ్. నిరుద్యోగం, అనారోగ్య సమస్యలు, ఊహించని ఖర్చులు, మెడికల్ ఎమర్జెన్సీల్లో మనల్ని ఆదుకునేది ఇదే. ఉదాహరణకు కరోనా పరిస్థితుల్నే తీసుకుందాం. కనీవినీ ఎరుగని ఈ విపత్తుకు అందరూ ప్రభావితమైనవారే. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అత్యవసర నిధి నిజంగా కొండంత బలమే. కనీసం మన 6 నెలల సంపాదనకు సమానంగా ఈ ఎమర్జన్సీ ఫండ్ ఉంటే మంచిది. అంటే నెల జీతం రూ.50వేలైతే.. రూ.3 లక్షల అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి.
ఏయే ఖర్చులను లెక్కేసుకోవాలి?
ఇంటి అద్దెలు, ఈఎంఐలు, మెడిసిన్స్, కనీస గృహ, వ్యక్తిగత అవసరాలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలి.
నగదు రూపంలోనే..
అత్యవసర నిధిని ఎప్పుడైనాసరే నగదుగానే ఉంచుకోవాలి. కానీ చాలామంది ఎమర్జన్సీ ఫండ్ పేరు చెప్పి బంగారం కొనేవాళ్లున్నారు. ఎప్పుడంటే అప్పుడు అమ్ముకోవచ్చనో.. లేక తాకట్టు పెట్టి సులువుగా రుణాలు తీసుకోవచ్చన్నదే వారి ఆలోచన. అయితే ఒక రకంగా ఈ పాయింట్ ఒప్పుకున్నా.. మరో రకంగా చూస్తే దండగే. తరుగు, కూలీ, వాల్యూ అడిషన్, వేస్టేజ్ పేరుతో మనకు చివరకు లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుంది మరి. పైగా మనకు అవసరం వచ్చినప్పుడు ఎవ్వరి దగ్గరా నగదు ఉండకపోవచ్చు. అదే మనవద్దే కొంత నగదుంటే బాగుంటుంది.
పొదుపు-పెట్టుబడి
ఫిక్స్ డిపాజిట్లు, లిక్విడ్ ఫండ్లు, ఆర్బీఐ జారీచేసే బాండ్లు వంటివి పొదుపు-పెట్టుబడులకు అత్యుత్తమంగా చెప్పుకోవచ్చు. లాకిన్ పీరియడ్ లేనివి, సులువుగా నగదుగా మార్చుకునే సాధనాలు క్లిష్ట పరిస్థితుల్లో మనకు ఉపయోగకరంగా ఉంటాయి.
ఇవి గుర్తుంచుకోండి
-నాగేంద్ర సాయి కుందవరం