న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26: రాబోయే నెలల్లో ఇండ్ల ధరలు పెరుగుతాయని దాదాపు 50 శాతం కొనుగోలుదారులు నమ్ముతున్నారు. కరోనా నేపథ్యంలో మార్కెట్లో పడిపోయిన డిమాండ్ తిరిగి పుంజుకుంటుండటంతో హౌజింగ్ ధరలు పరుగులు పెట్టడం ఖాయమన్న అభిప్రాయం వారి నుంచి వ్యక్తమవుతున్నది. ఈ మేరకు రియల్టీ పోర్టల్ హౌజింగ్.కామ్, పరిశ్రమ సంఘం నరెడ్కో సంయుక్తంగా నిర్వహించిన ఓ సర్వేలో తేలింది. ఈ ఏడాది ప్రథమార్ధానికి (జనవరి-జూన్)గాను ‘రెసిడెన్షియల్ రియల్టీ కన్జ్యూమర్ సెంటిమెంట్ సర్వే’ వివరాలను హౌజింగ్.కామ్, నరెడ్కో సోమవారం విడుదల చేశాయి. ఇందులో వెయ్యి మందికిపైగా బయ్యర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 48 శాతం మంది వచ్చే నెలల్లో ఇండ్ల ధరలు పెరుగుతాయనగా, 58 శాతం మంది నిర్మాణం పూర్తయిన ఇండ్లను సొంతం చేసుకోవాలన్న కోరికను వెలిబుచ్చారు. ఇక పెరిగిన ఉత్పాదక వ్యయం, వడ్డీరేట్లు, డిమాండ్ వల్లే ఇండ్ల ధరలూ పెరుగుతున్నాయని సర్వే చెప్తున్నది.
పెట్టుబడుల్లో రియల్టీదే హవా..
తాజా సర్వేలో పాల్గొన్నవారిలో 47 శాతం మంది రియల్ ఎస్టేట్లో పెట్టుబడులకే ఆసక్తిని ప్రదర్శించారు. అలాగే 21 శాతం మంది స్టాక్ మార్కెట్లలో మదుపు చేసేందుకు మొగ్గు చూపారు. ఇక 16 శాతం మంది ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ)లో, 15 శాతం మంది బంగారంపై ఇన్వెస్ట్ చేసేందుకు మక్కువ కనబర్చారని హౌజింగ్.కామ్, నరెడ్కో తెలిపాయి. దీంతో మున్ముందు ఇండ్ల అమ్మకాలు ఆశాజనకంగానే ఉంటాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. ముఖ్యంగా పండుగల సీజన్ కొనుగోళ్లతో నిర్మాణ రంగానికి కొత్త కళ రాగలదన్న విశ్వాసాన్ని కనబర్చాయి.