న్యూఢిల్లీ, ఆగస్టు 21: తిరిగి హానర్ ఫోన్లు మార్కెట్లో దర్శనం ఇవ్వబోతున్నాయి. వచ్చే నెల నుంచి హానర్ బ్రాండ్ స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు హానర్ టెక్ సోమవారం ప్రకటించింది. ఈ సందర్భంగా హానర్ టెక్ సీఈవో మాధవ్ మాట్లాడుతూ..వచ్చే ఏడాది చివరినాటికి 4-5 శాతం మార్కెట్ వాటా లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు, ఇందుకోసం వెయ్యి కోట్ల రూపాయల వరకు పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించారు.
హానర్టెక్ పూర్తిగా దేశీయ సంస్థ అని, ఇది విదేశీ సంస్థకాదని ఆయన స్పష్టంచేశారు. హానర్ ఫోన్లు మాత్రం చైనావని, కానీ, ఇది విక్రయించేది మాత్రం దేశీయ సంస్థ అని ఆయన గుర్తుచేశారు. హానర్ ఫోన్లకు సంబంధించి ఇప్పటికే పరిశోధనలు ప్రారంభమయ్యాయని, ఈ ఏడాది చివర్లోనే దేశీయంగా ఈ ఫోన్లను తయారు చేయనున్నట్లు ఆయన చెప్పారు.