న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4: జపాన్కు చెందిన ఆటోమొబైల్ దిగ్గజం హోండా మోటర్.. తాజాగా మధ్య స్థాయి ఎస్యూవీ సెగ్మెంట్లోకి ప్రవేశించింది. నూతన మాడల్ ఎలివేట్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కారు రూ.10.99 లక్షలు మొదలుకొని రూ.15.99 లక్షల గరిష్ఠ స్థాయిలో ఢిల్లీ షోరూంలో లభించనున్నది. వీటిలో మాన్యువల్ రకం రూ.10.99 లక్షల నుంచి రూ.14.9 లక్షల లోపు, ఆటోమేటిక్ వెర్షన్ రూ.13.2 లక్షల నుంచి రూ.15.99 లక్షల లోపు లభించనున్నది. 1.5 లీటర్ల పెట్రోల్ ఇంజిన్ కలిగిన ఈ కారు 16.92 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వనున్నది.
హ్యుందాయ్ క్రెటా, మారుతి గ్రాండ్ విటారా, కియా సెల్టోస్, టయోటా అర్బన్ క్రూజర్లకు పోటీ సంస్థ ఈ మాడల్ను పరిచయం చేసింది. ఈ సందర్భంగా హోండా కార్స్ ఇండియా ప్రెసిడెంట్, సీఈవో తకుయా త్సుమురా మాట్లాడుతూ.. 2030 నాటికి దేశీయ మార్కెట్లోకి ఐదు స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాలను విడుదల చేయాలనుకుంటున్నట్లు, దేశీయంగా ఎస్యూవీలకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని ఈ ఐదు మాడళ్లను తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం సంస్థ సిటీ, అమేజ్ సెడాన్ మాడళ్ళను దేశీయంగా విక్రయిస్తున్నది.