Home Loan Subsidy Ends | శుక్రవారం నుంచి 2022-23 ఆర్థిక సంవత్సరం ప్రారంభమైంది. ఆర్థిక లావాదేవీలు, పన్ను చెల్లింపులకు సంబంధించి పలు నిబంధనలు కూడా మారాయి. దీని ప్రభావం సగటు భారతీయుడి ఆదాయం, ఖర్చులు, పెట్టుబడులపై ప్రభావం పడుతుంది. హోంలోన్పై చెల్లించే వడ్డీపై పన్ను రాయితీ గురువారంతో ముగిసింది. పాన్-ఆధార్ అనుసంధానించకుంటే రూ.500-1000 జరిమానా చెల్లించాల్సి వస్తుంది. ఇలా ఎనిమిది రకాల మార్పులతో సగటు పౌరుడి జేబుకు చిల్లు పెట్టడం ఖాయంగా కనిపిస్తున్నది. అవేమిటో చూద్దామా..
ప్రావిడెండ్ ఫండ్ (పీఎఫ్)లో ఉద్యోగులు మదుపు చేసే మొత్తంపై వచ్చే వడ్డీ ఆదాయానికి కూడా ఆదాయం పన్ను వర్తిస్తుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగులు తమ ఈపీఎఫ్వో ఖాతాలో రూ.2.5 లక్షలకు పైగా జమ చేశారనుకోండి. దానిపై వచ్చే వడ్డీ ఆదాయం మీద ఆదాయం పన్ను చెల్లించాలి. పీఎఫ్ వడ్డీ ఆదాయంపై పన్నును రెండు రకాలుగా విభజిస్తారు. రూ.2.5 లక్షల్లోపు కంట్రిబ్యూషన్పై వచ్చే వడ్డీ ఆదాయానికి పన్ను రాయితీ ఉంటుంది. రూ.2.5 లక్షలు దాటిన కంట్రిబ్యూషన్కు వచ్చే వడ్డీ ఆదాయంపై పన్ను వర్తిస్తుంది. అయితే, ప్రభుత్వోద్యోగుల పీఎఫ్ ఖాతాలకు మాత్రం రూ.5 లక్షల వరకు మినహాయింపు ఉంటుంది.
మీరు చౌకధరకే ఇల్లు కొనుగోలు చేశారనుకోండి. ఆదాయం పన్ను చట్టంలోని 80ఈఈఏ సెక్షన్ కింద రూ.1.5 లక్షల వరకు వడ్డీ చెల్లింపుపై అదనపు మినహాయింపు ఉంటుంది. ఒకవేళ మీరు కొన్న ఇంటి ధర రూ.45 లక్షల్లోపు ఉంటే.. దానిపై చెల్లించే వడ్డీలో రూ.1.5 లక్షల వరకు అనదపు మినహాయింపు క్లయిమ్ చేయొచ్చు. ఆదాయం పన్ను చట్టంలోని 24బీ సెక్షన్ కింద రూ.2 లక్షల వడ్డీ చెల్లింపుపై మినహాయింపునకు అదనం. అయితే, 2019 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 2022 మార్చి 31 లోపు ఇంటి రుణం తీసుకున్న పన్ను చెల్లింపుదారులకు మాత్రమే లబ్ధి చేకూరుస్తుంది.
మీరు క్రిప్టో కరెన్సీల్లో పెట్టుబడులు పెట్టారా.. ఇకముందు పెడుతున్నారా.. అయితే, ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి క్రిప్టో కరెన్సీల్లో పెట్టుబడులపై ఆదాయం పన్ను భారీగా చెల్లించాల్సిందే. వర్చువల్ డిజిటల్ అసెట్స్ లేదా క్రిప్టో ఆస్తులపై పన్ను 30 శాతం వరకు విధిస్తున్నారు. ఒకవేళ మీరు క్రిప్టో కరెన్సీ టోకెన్ల విక్రయం ద్వారా లాభ పడ్డతారా.. అయితే మీరు పన్ను చెల్లించాల్సిందే. జూలై ఒకటో తేదీ నుంచి ఒకశాతం టీడీఎస్ కూడా డిడక్ట్ చేస్తారు.
నూతన ఆర్థిక సంవత్సరంలో హెల్త్కేర్ మరింత ఖర్చుతో కూడుకున్నది కాబోతున్నది. సుమారు 800 రకాల ప్రాణ రక్షక ఔషధాల ధరలు 10 శాతం పెరుగనున్నాయి. ఇది వైద్య చికిత్స ఖర్చు పెంచుతుంది.
ప్రతి పన్ను చెల్లింపుదారు తన ఆధార్తో పాన్కార్డును గురువారం రాత్రి 12 గంటల్లోపు అనుసంధానించాల్సిందే. లేదంటే పెనాల్టీ చెల్లించాల్సి వస్తుంది. 2022 జూన్ 30 వరకు రూ.500, అటుపై రూ.1000 పెనాల్టీ పే చేయాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది మార్చి 31 లోపు కూడా ఆధార్తో అనుసంధానం చేయకుంటే.. సదరు పాన్కార్డ్ నంబర్ ఇన్యాక్టివ్ అవుతుంది.
కేంద్ర ప్రభుత్వం తన ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను విస్తరిస్తున్నది. అందుకోసం ప్రతి ఆర్థిక సంవత్సరంలో రూ.20 కోట్లకు పైగా టర్నోవర్ గల వ్యాపార సంస్థలు తప్పనిసరిగా ఈ-ఇన్వాయిస్లు జారీ చేయడం తప్పనిసరి. ప్రతి బిజినెస్ లావాదేవీకి ఈ-ఇన్వాయిస్ జారీ చయాల్సిందే. ఒకవేళ ఈ-ఇన్వాయిస్లు జారీ చేయడంలో విఫలమైతే రవాణ అవుతున్న సరుకులను జప్తు చేసే అధికారం అధికారులకు ఉంటుందది. అంతే కాదు.. కొనుగోలుదారు ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ పొందడం కష్టతరం అవుతుంది.
ప్రతి కంపెనీ తన అకౌంట్ సాఫ్ట్వేర్లో అడిట్ ట్రయల్ ఫీచర్ చేర్చాల్సి ఉంటుంది. సదరు కంపెనీలో ప్రారంభమైన లావాదేవీల్లో మార్పులు, చేర్పులను అడిట్ ట్రయల్ ఫీచర్ రికార్డు చేస్తుంది. అధికారుల డిమాండ్ మేరకు అడిట్ ట్రయల్ అందుబాటులో ఉంచాలి.
జాతీయ రహదారులపై ప్రయాణం చేయడం చాలా ఖర్చుతో కూడుకున్నది. గురువారం అర్ధరాత్రి తర్వాత టోల్ టాక్స్ రూ.10 నుంచి 65లకు పెంచుతూ భారత జాతీయ రహదారుల సంస్థ -ఎన్హెచ్ఏఐ ( National Highways Authority of India- NHAI ) ఆదేశాలు జారీ చేసింది. చిన్న వాహనాలపై టోల్ రూ.10 నుంచి రూ.15లకు, వాణిజ్య వాహనాలపై రూ.65 వరకు పెరుగనున్నది.
ప్రభుత్వోద్యోగులు తమ యాజమాన్యం నుంచి ఎన్పీఎస్ కంట్రిబ్యూషన్ డిడక్షన్ క్లయిమ్ చేయొచ్చు. మీరు రెండేండ్ల తర్వాత అప్డేటెడ్ ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయొచ్చు. రూ.10 లక్షల వరకు కరోనా చికిత్సపై పన్ను రాయితీ ఉంటుంది. నెట్బ్యాంకింగ్, యూపీఐ ద్వారా మాత్రమే మ్యూచువల్ఫండ్స్లో పెట్టుబడులు పెట్టాలి. 75 ఏండ్లు దాటిన వృద్ధులకు ప్రతియేటా ఐటీ రిటర్న్స్ దాఖలు నుంచి మినహాయింపు లభిస్తుంది.