RBI Warning | అధిక లాభాలు ఆశించి వివిధ పథకాల్లో పెట్టుబడులు పెట్టే మదుపర్లు జాగ్రత్తగా ఉండాలని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ హెచ్చరించారు. అధిక లాభాల కోసం ఆయా పథకాల్లో పెట్టుబడులు పెడితే హైరిస్క్లు (అధిక ప్రమాదాలు) పొంచి ఉన్నాయని పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో అధిక లాభాలు ఆశించి క్రిప్టో కరెన్సీల్లో భారతీయులు భారీగా పెట్టుబడులు పెట్టారని వార్తలొస్తున్న నేపథ్యంలో శక్తికాంత దాస్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.
ఆదివారం జరిగిన ఆయన డిపాజిటర్స్ ఫస్ట్: గ్యారెంటెడ్ టైంబౌండ్ డిపాజిట్ ఇన్సూరెన్స్
పేమెంట్ కార్యక్రమంలో మాట్లాడారు. (డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) చట్టం కింద బ్యాంకులో డిపాజిట్లపై రూ. 5 లక్షల హామీతో కూడిన ఇన్సూరెన్స్ లభిస్తుంది. బ్యాంకింగ్ రంగంలోని అన్ని విభాగాలు ఉమ్మడిగా పని చేస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారత్ చుక్కానిగా మారుతుందని శక్తికాంత దాస్ పేర్కొన్నారు. బ్యాంకింగ్ వ్యవస్థ దృఢంగా, నిలకడగా ముందుకు సాగేందుకు బ్యాంకుల్లో కార్పొరేట్ సుపరిపాలన మార్గదర్శకాల బలోపేతానికి ఆర్బీఐ చర్యలు తీసుకుంటుందన్నారు.
ఇటీవల బ్యాంకింగ్ రంగంలో బ్యాంకింగ్ వ్యవస్థ రెండు కీలక మైలు రాళ్లు దాటింది. 27 ఏండ్ల అంతరాయం తర్వాత బ్యాంకుల్లో డిపాజిట్లపై బీమా పరిమితిని రూ. లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచాయి. 1993లో దాని పరిమితి రూ.లక్షగా నిర్ణయించింది. డిపాజిట్ చేసిన 90 రోజుల్లో బ్యాంకులు వారికి గ్యారంటీ కల్పించాయి అని శక్తికాంత దాస్ చెప్పారు.ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా పాల్గొన్నారు.