హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ) : వ్యాధుల చికిత్స, ఔషధ తయారీలో హైదరాబాద్ ప్రపంచానికి విశ్వసనీయ కేంద్రంగా ఉందని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం హైటెక్స్లో జరుగుతున్న ఇండియా ఫార్మా ఎక్స్పో-2026 కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. రాష్ట్రం ఫార్మా, హెల్త్ కేర్ రంగాల్లో అగ్రగామిగా నిలిచి ప్రపంచానికి నాణ్యమైన మందులు, వ్యాక్సిన్లను అందిస్తున్నదని తెలిపారు.
రాష్ట్రంలో 1500కు పైగా యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రిడియెంట్స్, బల్క్డ్రగ్స్, వ్యాక్సిన్లు, మెడికల్ పరికరాలు తదితర తయారీ యూనిట్ల బలమైన వ్యవస్థ ఉందని వివరించారు. 80కు పైగా టెస్టింగ్ సెంటర్లు, 50 వేలకు పైగా మెడికల్ షాపులు ఉన్నట్టు వెల్లడించారు. మెడికల్, ఫార్మా రంగాల్లో ప్రపంచం హైదరాబాద్ వైపు చూస్తున్నదని.. నాణ్యత, భద్రత, పారదర్శకత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని ఆయన ఫార్మా సంస్థలకు సూచించారు. నకిలీ, నాసిరకం ఔషధాలు ప్రజారోగ్యానికి పెద్ద ముప్పు అని, దీనిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నదని హెచ్చరించారు.