న్యూఢిల్లీ, జూలై 13 : హెచ్సీఎల్ టెక్నాలజీస్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్ త్రైమాసికానికిగాను సంస్థ రూ.4,624 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన లాభంతో పోలిస్తే 20 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 14 శాతం అధికమై రూ.34,576 కోట్లకు చేరుకున్నది. మరోవైపు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను రూ.2 ముఖ విలువ కలిగిన ప్రతిషేరుకూ రూ.12 మధ్యంతర డివిడెండ్ను కంపెనీ బోర్డు ప్రకటించింది.
ఈ సందర్భంగా కంపెనీ చైర్పర్సన్ రోష్నీ నాడర్ మల్హోత్రా మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ పరివర్తనను ఏఐ వేగవంతం చేస్తున్నదని, దీంతో కంపెనీ కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడానికి అన్ని విధాలుగా ప్రయత్నాలను ముమ్మరం చేసిందన్నారు. క్లయింట్లకు తమ వ్యాపార వ్యూహాలను ముందుకు నడిపించడానికి నూతన సాంకేతిక సేవలను అందిస్తున్నట్టు, అలాగే ఉద్యోగులను ఈ నూతన టెక్నాలజీ నైపుణ్యాన్ని పెంపొందించడానికి ప్రత్యేకంగా దృష్టిసారించినట్టు చెప్పారు. గత త్రైమాసికంలో కొత్తగా 2.4 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు తెలిపారు. మరోవైపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయంలో వృద్ది 1-4 శాతంగా ఉంటుందని గైడెన్స్లో పేర్కొంది.