హైదరాబాద్, అక్టోబర్ 25: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు అందిస్తున్న గల్ఫ్ ఆయిల్ లుబ్రికేంట్స్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. సెప్టెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.73.63 కోట్ల నికర లాభాన్ని గడించింది. ఏడాది క్రితం ఆర్జించిన రూ.52.14 కోట్ల లాభంతో పోలిస్తే 41 శాతం వృద్ధి నమోదైందని పేర్కొంది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.719.50 కోట్ల నుంచి రూ.802 కోట్లకు ఎగబాకినట్టు వెల్లడించింది.
గత త్రైమాసికంలో ఆల్-రౌండ్ పనితీరు కనబరిచినట్టు, విలువ, ఆదాయ, మార్జిన్, లాభాల పరంగా రెండంకెల వృద్ధి నమోదైందని గల్ఫ్ ఆయిల్ ఎండీ, సీఈవో రవి చావ్లా తెలిపారు. ఎబిటా మార్జిన్ రూ.100 కోట్ల దాటడం విశేషమని పేర్కొన్నారు. వ్యూహాత్మక వ్యాపార విస్తరణలో భాగంగా రిటైల్ అవుట్లెట్ల సంఖ్యను పెంచుకోవడం వల్లనే ఆర్థిక ఫలితాల్లో రెండంకెల వృద్ధి నమోదైందని, దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఆశించిన స్థాయిలో వృద్ధిని కనబరిచినట్టు చెప్పారు. మధ్యప్రాచ్యంతోపాటు రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం కొనసాగుతుండటం స్వల్ఫంగా ప్రభావం చూపే అవకాశాలున్నాయని ఆయన పేర్కొన్నారు.