న్యూఢిల్లీ, డిసెంబర్ 17: కొన్ని జీఎస్టీ నేరాలను క్రిమినల్ నేరాలుగా పరిగణించరాదని, జీఎస్టీ చట్టం ప్రకారం ప్రాసిక్యూషన్ ప్రారంభించడానికి నిర్దేశిత పరిమితిని రూ.1 కోటి నుంచి రూ. 2 కోట్లకు పెంచాలని శనివారం జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది. అయితే నకిలీ ఇన్వాయిసింగ్ పరిమితిని మాత్రం రూ.1 కోటిగానే అట్టిపెట్టారు. ఎటువంటి పన్ను చెల్లించకపోవడం, తక్కువ పన్నులు చెల్లించడం, తప్పుడు ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ తీసుకోవడం, వినియోగించడం సరిగ్గా లేకపోవడం, రిఫండ్ తప్పుగా చూపించడం, నకిలీ ఇన్వాయిసింగ్ సమర్పించడం జీఎస్టీ చట్టం ప్రకారం ప్రధాన నేరాలు. 48వ కౌన్సిల్ సమావేశం జరిగిన అనంతరం మీడియాకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివరాలు వెల్లడిస్తూ కౌన్సిల్ ముందు అజెండాలో 15 ఐటెమ్స్ ఉండగా, సమయం తక్కువగా ఉన్నందున ఎనిమిది అంశాలపై మాత్రమే నిర్ణయం తీసుకున్నామన్నారు. తాజాగా కొత్త పన్నులు విధించలేదన్నారు. అజెండా ఐటెమ్స్..పాన్ మసాలా, గుట్కా సంస్థలపై పన్ను, అప్పిలేట్ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయాలన్న మంత్రుల గ్రూప్ నివేదికలను పరిగణనలోకి తీసుకోలేకపోయామని సీతారామన్ చెప్పారు.
స్పోర్ట్ యుటిలిటీ వాహనాలకు (ఎస్యూవీలు) అధికంగా 22 శాతం పరిహారపు సెస్ విధింపుపై సీతారామన్ వివరణ ఇస్తూ..వాహనం ఎస్యూవీగా గుర్తింపు, ఇంజన్ సామర్థ్యం 1500 సీసీ, 4000 ఎంఎం, 170 ఎంఎంకు మించిన గ్రౌండ్ క్లియరెన్స్ – నాలుగు షరతులతో కూడిన మోటారు వాహనానికి 22 శాతం పరిహారపు సెస్ వర్తిస్తుందని తెలిపారు. ఇది కొత్త పన్ను కాదని, నిర్దేశిత పన్ను అమలుకు నిర్వచనమని చెప్పారు. కొన్ని రాష్ర్టాలు సెడాన్లను కూడా ఎస్యూవీ క్యాటగిరీలో చేర్చవచ్చా అని అడుగుతున్నాయని, మల్టీ యటిలిటీ వాహనాల్ని (ఎంయూవీలు) నిర్వచించాలని కోరుతున్నాయని మంత్రి వివరించారు. 22 శాతం సెస్లో ఇతర మోటారు వాహనాల్ని చేర్చే అంశమై కేంద్ర, రాష్ట్ర పన్ను అధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేయాలని కౌన్సిల్ నిర్ణయించిందన్నారు.