GST on Hotel Services | ద్రవ్యలోటు పెరిగిపోయే అవకాశాలు కనిపిస్తుండటంతో దాని భర్తీపైనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టాయి. ఆదాయం పెంచుకోవడానికే మొగ్గు చూపుతున్నాయి. హోటల్ గదిలో బసకు రూ.1000 చార్జీపై ఇప్పటివరకు ఉన్న మినహాయింపును జీఎస్టీ కౌన్సిల్ ఉపసంహరించింది. ఇక నుంచి 12 శాతం జీఎస్టీ వసూలు చేయాలని నిర్ణయిస్తూ మంగళవారం చండీగఢ్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన మొదలైన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నిర్ణయించింది. వివిధ రకాల హోటల్ సేవలపైనా 12 శాతం పన్ను విధిస్తారు. అలాగే దవాఖానలో చికిత్స పొందుతున్న రోగులు చెల్లించే చార్జీ రూ.5000 పైగా ఉంటే ఐదు శాతం జీఎస్టీ లెవీ విధిస్తారు.
పోస్ట్ కార్డులు, ఇన్లాండ్ లెటర్లు, బుక్పోస్టులు, 10 గ్రాముల్లోపు ఎన్వలప్లు మినహా అన్ని రకాల పోస్టాఫీసు సేవలపై పన్ను విధిస్తారు. ఇక నుంచి బ్యాంకులో చెక్లు విడిగా గానీ, బుక్ రూపంలో తీసుకున్నా 18 శాతం జీఎస్టీ చెల్లించాల్సిందే. వ్యాపార సంస్థల భవనాల అద్దెపై పన్ను మినహాయింపుకు రాం రాం పలికింది. కొన్ని వస్తువులు, సేవలపై జీఎస్టీని హేతుబద్ధీకరించాలని కర్ణాటక సీఎం బసవరాజు ఎస్ బొమ్మై సారధ్యంలో రాష్ట్రాల ఆర్థిక మంత్రుల గ్రూప్ ఇచ్చిన తాత్కాలిక నివేదిక ఆమోదించింది.
పన్ను ఎగవేతకు చెక్ పెట్టేందుకు వివిధ రాష్ట్రాల మధ్య బంగారం, ఆభరణాలు, ఇతర విలువైన లోహాల రవాణాపై ఈ-వే బిల్లులు రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసేందుకు అనుమతించింది. రూ.2 లక్షలు, అంతకంటే ఎక్కువ మొత్తం విలువ గల లోహాలకు వర్తింపు చేయాలని రాష్ట్ర ఆర్థిక మంత్రుల ప్యానెల్ కోరింది.