GST collection | జూలైతో పోలిస్తే ఆగస్టులో జీఎస్టీ వసూళ్లు తగ్గినా.. 2021తో పోలిస్తే గత నెలలో జీఎస్టీ వసూళ్లు 28 శాతం పెరిగాయి. ఆగస్టులో రూ.1.43 లక్షల కోట్ల మేరకు జీఎస్టీ వసూళ్లు జరిగాయి. 2021 ఆగస్టులో రూ.1.12 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు జరిగాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ తెలిపింది. కానీ, కానీ గత జూలైలో రూ.1.49 లక్షల కోట్లు (నాలుగు శాతం) వసూలు కావడం గమనార్హం. గతనెలలో వివిధ రాష్ట్రాలతో పోలిస్తే పన్ను వసూళ్లలో మహారాష్ట్ర మొదటి స్థానంలో నిలిచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్లో అత్యధికంగా రూ.1.67 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయి. 2021-22 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే గత ఐదు నెలల్లో జీఎస్టీ వసూళ్లలో 33 శాతం (రూ.7.46 లక్షల కోట్లు) గ్రోత్ రికార్డైంది. ఈ ఏడాదిలో వరుసగా ఆరో నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.1.40 లక్షల కోట్లు దాటాయి.
ఆగస్టు నెల జీఎస్టీ వసూళ్లలో సీ-జీఎస్టీ రూ.24,710 కోట్లు, ఎస్-జీఎస్టీ రూ.30,951 కోట్లు ఐ-జీఎస్టీ రూపేణా రూ.77,782 కోట్లు వసూలయ్యాయి. అదనంగా సెస్ రూపంలో రూ.10,168 కోట్లు వసూలు అయ్యాయి. జూలైలో సీ-జీఎస్టీ రూ.25,751 కోట్లు, ఎస్-జీఎస్టీ రూ.32,807 కోట్లు, ఐ-జీఎస్టీ రూ. 79,518 కోట్లు, సెస్ రూ.10,920 కోట్లు వసూలయ్యాయని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది.
అండమాన్ నికోబార్, లక్ష్యద్వీప్, మణిపూర్ దీవులు మినహా 14 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో జీఎస్టీ వసూళ్లు పెరిగాయి. అరుణాచల్ ప్రదేశ్లో 11 శాతం, అసోంలో 10, ఛత్తీస్గఢ్లో రెండు శాతం, డామన్ అండ్ డయూలో నాలుగు శాతం, హిమాచల్ ప్రదేశ్లో ఒకశాతం, జమ్ముకశ్మీర్లో 11 శాతం, రాజస్థాన్లో 10, సిక్కిం 13, తెలంగాణ పది శాతం జీఎస్టీ వసూళ్లు పెరిగాయి. అండమాన్ నికోబార్ దీవుల్లో మైనస్ 21 శాతం, లక్ష్యద్వీప్లో 73 శాతం, మణిపూర్లో 22 శాతం జీఎస్టీ వసూళ్లు పడిపోయాయి.