GST Collection | 2022తో పోలిస్తే సెప్టెంబర్ స్థూల జీఎస్టీ వసూళ్లు 10 శాతం పెరిగి, రూ.1.63 లక్షల కోట్లకు పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ వసూళ్లు రూ.1.60 లక్షల కోట్లు దాటడం ఇది నాలుగో సారి. 2023-సెప్టెంబర్లో జీఎస్టీ వసూళ్లు రూ.1,62,712 కోట్లకు చేరాయి. సెప్టెంబర్ నెలతో ముగిసిన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్థభాగంలో స్థూల జీఎస్టీ వసూళ్లు 11 శాతం గ్రోత్ నమోదు చేశాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.8,93,334 కోట్ల జీఎస్టీ వసూళ్లు జరగ్గా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.9,92,508 కోట్లకు చేరాయి.
‘గతేడాదితో పోలిస్తే 2023 సెప్టెంబర్లో జీఎస్టీ రెవెన్యూ వసూళ్లు 10 శాతానికి పైగా నమోదయ్యాయి. దిగుమతి సర్వీసులతోపాటు దేశీయ లావాదేవీల ద్వారా 14 శాతానికి పైగా రెవెన్యూ వచ్చింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ వసూళ్లు రూ.1.60 లక్షల కోట్లు దాటడం నాలుగో సారి’ అని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రతి నెలా సగటున రూ.1.65 లక్షల కోట్ల స్థూల జీఎస్టీ వసూళ్లు నమోదు కాగా, గతేడాది రూ.1.49 లక్షల కోట్లు వసూళ్లయ్యాయి. ఇది 11 శాతం ఎక్కువ. మొత్తం సెప్టెంబర్ జీఎస్టీ వసూళ్లలో జీసీఎస్టీ రూ.29,818 కోట్లు, ఎస్జీఎస్టీ రూ.37,657 కోట్లు, ఐజీఎస్టీ (దిగుమతి వస్తువులపై సుంకం రూ.41,145 కోట్లతో కలుపుకుని) రూ. 83,623 కోట్లు, దిగుమతి వస్తువులపై సుంకం రూ.881 కోట్లతో కలుపుకుని సెస్ రూ.11,613 కోట్లు వసూలయ్యాయి.