Gadkari on Flex fuel Engines | కార్లలో ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజిన్లను తప్పనిసరి చేస్తూ వచ్చే మూడు, నాలుగు నెలల్లో ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయనున్నదని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. స్థానికంగా తయారుచేసిన ఇథనాల్ వాడకంతో పెట్రోల్-డీజిల్ వినియోగం నుంచి దేశానికి ఉపశమనం కలుగుతుందన్నారు. శుక్రవారం ఆయన మహారాష్ట్రలోని పుణెలో ఫ్లైఓవర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా గడ్కరీ మాట్లాడుతూ బీఎండబ్ల్యూ, మెర్సిడెజ్ బెంజ్, టాటా, మహీంద్రా తదితర కార్ల తయారీ సంస్థలు తప్పనిసరిగా ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజిన్ వాడాల్సిందేనన్నారు. బజాజ్ ఆటో, టీవీఎస్ వంటి కంపెనీలు కూడా ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజిన్లు తయారు చేయాల్సిందేనా అని మీడియా ప్రశ్నించినప్పుడు వారు ఉత్పత్తి చేస్తే తప్ప.. ఇప్పటికిప్పుడు వారికి సూచనలు ఇవ్వాలని తనకు ఆదేశాలు రాలేదన్నారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కూడా పాల్గొన్నారు.