Govt Provide Funds to Banks | ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకులకు కేంద్ర ప్రభుత్వం రూ.15 వేల కోట్ల నిధులు సమకూర్చనున్నది. అందులో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ అధిక వాటా పొందనున్నాయి. రెగ్యులేటరీ నిబంధనలను అమలు చేసేందుకు ఈ బ్యాంకులకు కేంద్రం నిధులు సమకూరుస్తున్నది. నాన్ ఇంటరెస్ట్ బేరింగ్ బాండ్ల ద్వారా గతేడాది నిధులు పొందిన బ్యాంకులకు ఈ రూ.15 వేల కోట్లు అందుతాయి.
బాండ్ల రూపంలో విడుదల చేసే ఈ స్పెషల్ సెక్యూరిటీస్ గడువు 10-15 ఏండ్లు ఉంటుంది. ఆర్బీఐ నిబంధనల స్థాయిని అందుకోలేని బ్యాంకులకు ఈ సాయం అందుతుంది. ఈ నెల ప్రారంభంలో ప్రిఫరెన్స్ షేర్లు జారీ చేయడం ద్వారా పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ రూ.4,600 కోట్ల మూల ధన పెట్టుబడి సమకూర్చుకునేందుకు అనుమతి లభించింది.
ప్రభుత్వ రంగ బ్యాంకులకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులకు సమకూర్చాల్సిన నిధులను రూ.20 వేల నుంచి రూ.15 వేల కోట్లకు కుదించాలని కేంద్రం నిర్ణయించింది. 2020-21లో పంజాబ్ సింద్ బ్యాంక్కు నాన్ ఇంటరెస్ట్ బాండ్ల ద్వారా నిధులు సమకూర్చింది. అటుపై బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంకులకు గతేడాది మార్చిలో రూ.14,500 కోట్ల నిధులు సమకూర్చింది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.4,800 కోట్లు, యూకో బ్యాంక్ రూ.2,600 కోట్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.3000 కోట్లు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ రూ.4,100 కోట్ల నిధులు పొందాయి.