న్యూఢిల్లీ, అక్టోబర్ 26: దేశీయ స్టాక్ మార్కెట్లలో ఎల్ఐసీ షేర్ల పరిస్థితి.. కేంద్ర ప్రభుత్వానికి ఎంతమాత్రం మింగుడుపడటం లేదు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా పబ్లిక్ ఇష్యూకు వచ్చిన ఈ ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం షేర్లు.. ఇప్పుడు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. మదుపరులను ఆకట్టుకోవడంలో విఫలమవుతున్నాయి. ఈ ఏడాది మే నెలలో గరిష్ఠ ఇష్యూ ధర రూ.949తో వచ్చిన ఎల్ఐసీ షేర్లు.. రూ.872 వద్ద లిస్టింగైయ్యాయి. ప్రస్తుతం రూ.595.5 వద్ద ఉన్నాయి. దీంతో గడిచిన ఐదు నెలలకుపైగా కాలంలో ఒక్కో షేర్ విలువ దాదాపు రూ.300 వరకు నష్టపోయినైట్టెంది.
ఈ క్రమంలోనే తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఎల్ఐసీ పనితీరుపై సమీక్ష నిర్వహించింది. ఈ సందర్భంగా మదుపరులను ఆకర్షించేందుకు సంపద పెంచుకోవాలని, ముఖ్యంగా నాన్-పార్టిసిపేటింగ్ ప్రోడక్ట్స్ లేదా టర్మ్ ప్లాన్లకు ప్రాధాన్యత ఇవ్వాలని సంస్థకు సూచించింది. నాన్-పార్టిసిపేటింగ్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ల్లో వచ్చే లాభాన్ని పాలసీదారులకు డివిడెండ్ రూపంలో ఇవ్వాల్సిన అవసరం ఉండదు. అందుకే వీటిని ఎక్కువగా ఆఫర్ చేయాలని కేంద్రం చెప్తున్నది. దాంతో సంస్థ లాభాలు పెరిగి మార్కెట్లో షేర్ ధర పుంజుకోగలదని విశ్లేషిస్తున్నది. ఎల్ఐసీ ఐపీవోతో ఖజానాకు దాదాపు రూ.21,000 కోట్ల ఆదాయం సమకూరింది తెలిసిందే.