Vodafone Idea | కేంద్ర ప్రభుత్వానికి ప్రైవేట్ టెలికాం కంపెనీలు కొనేందుకు ఎటువంటి ఆసక్తి లేదని వొడాఫోన్ ఐడియా తెలిపింది. రుణ, ఫీజు తదితర బకాయిలపై వడ్డీలను ఈక్విటీ రూపంలో చెల్లించేందుకు కేంద్రం వెసులుబాటు కల్పించిందని వొడాఫోన్ ఐడియా సీఈవో కం ఎండీ రవీందర్ టక్కర్ చెప్పారు. దేశంలో మూడు ప్రైవేట్ టెలికం సర్వీస్ ప్రొవైడర్లు ఉండాలని కేంద్రం భావిస్తున్నదన్నారు. ఇతర సంస్థలతో తమ సంస్థ మార్కెట్లో పోటీ పడాలని ప్రభుత్వం ఆశిస్తున్నదని తెలిపారు.
వొడాఫోన్ ఐడియాకు మొత్తం రూ.1.91 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. వీటిలో స్పెక్ట్రం కేటాయింపుల పేమెంట్స్ రూ.1.06 లక్షల కోట్లు, ఏజీఆర్ బకాయిలు రూ.62,180 కోట్లు, బ్యాంకులు ఇతర ఆర్థిక సంస్థలకు రూ.23,400 కోట్లు వొడాఫోన్ ఐడియా బకాయి పడింది. ఈ నేపథ్యంలో ఏజీఆర్ బకాయిల చెల్లింపులపై కేంద్రం నాలుగేండ్ల మారటోరియం విధించింది. ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్న టెలికం రంగాన్ని ఆదుకునేందుకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం తొమ్మిది అంశాలతో కూడిన సంస్కరణలు ప్రకటించిన సంగతి తెలిసిందే.