LPG Subsidy | సబ్కా సాత్.. సబ్కా వికాస్ నినాదంతో ముందుకెళుతున్న కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ సామాన్యుడి నడ్డి విరుస్తోంది. నిరుపేద రాయితీని కూడా ఆదాయంగా మార్చుకుంటోంది. నాలుగేండ్లలో ఎల్పీజీ సిలిండర్లపై కేంద్రం ఇస్తున్న సబ్సిడీ రూ.23,464 కోట్ల నుంచి రూ.242 కోట్లకు పరిమితమైందని కేంద్ర చమురు మంత్రిత్వశాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఇలా పేదలకు ఇచ్చే సబ్సిడీకి చెల్లు చీటి ఇవ్వడం వల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.11,654 కోట్లు ఆదా అవుతుంది. వివిధ కార్పొరేట్ సంస్థలకు రూ.లక్షల కోట్లలో రాయితీల ముందు.. పేదల వంట గ్యాస్ సిలిండర్లకు సబ్సిడీ పద్దు చాలా తక్కువే. 2020-21లో వంట గ్యాస్ సిలిండర్లపై రూ.11,896 కోట్ల సబ్సిడీ ఇచ్చిన కేంద్రం.. గత ఆర్థిక సంవత్సరానికి వచ్చేసరికి రూ.242 కోట్లకు పరిమితం చేసింది.
2017-18లో వంట గ్యాస్ సబ్సిడీ రూ.23,464 కోట్లయితే, 2018-19లో రూ.37,209 కోట్లకు చేరుకున్నది. ఈ నేపథ్యంలో స్వచ్ఛందంగా సబ్సిడీ వదులుకోవాలని వంట గ్యాస్ సిలిండర్ల యూజర్లకు కేంద్రం విజ్ఞప్తి చేస్తూ వచ్చింది. దీనివల్ల 2019-20లో గ్యాస్ సబ్సిడీ రూ.24,172 కోట్లకు పడిపోయింది. 2020-21 నాటికి ఆ సబ్సిడీ సగానికి పైగా తగ్గి రూ.11,896 కోట్లకు దిగి వచ్చింది. అటుపై 2021-22లో వంట గ్యాస్ సబ్సిడీ కేవలం రూ.242 కోట్లు మాత్రమే.
2020 జూన్లో కేవలం ప్రధానమంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై) లబ్ధిదారులకు మాత్రమే వంట గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో వంట గ్యాస్పై సబ్సిడీ పొందుతున్న లబ్ధిదారుల సంఖ్య భారీగా పడిపోయింది. పీఎంయూవై లబ్ధిదారులకు ఏటా 12 సబ్సిడీ సిలిండర్లు ఇవ్వాలని కూడా కేంద్రం తీర్మానించింది. ఒక్కో సిలిండర్పై రూ.200 సబ్సిడీని ప్రవేశపెట్టింది.
ఢిల్లీలో గతేడాది జూలై 23న వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.834.50లకు చేరుకున్నది. గత ఏడాది కాలంలో పలు దఫాలుగా సిలిండర్ ధర పెంచడంతో దాని ధర రూ.218.40 పెరిగి ఇప్పుడు రూ.1053కు చేరింది. దీనిపై సబ్సిడీ పూర్తిగా రద్దు చేసేసినట్లయింది. దేశవ్యాప్తంగా 30 కోట్ల వంటగ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వాటిలో తొమ్మిది కోట్లకు పైగా ఎల్పీజీ కనెక్షన్లు ఉజ్వల (పీఎంయూవై) స్కీం కింద ఉన్నవే కావడం గమనార్హం.