Gold Rates | అంతర్జాతీయ మార్కెట్లలో బలహీనతలతో శుక్రవారం దేశీయ బులియన్ మార్కెట్లో పది గ్రాముల బంగారం (24 క్యారట్స్) ధర రూ.875 తగ్గి రూ.66,575 వద్ద స్థిర పడిందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ తెలిపింది. గురువారం దేశ రాజధానిలో తులం బంగారం ధర రూ.67,450 వద్ద స్థిర పడిన సంగతి తెలిసిందే. మరోవైపు గురువారంతో పోలిస్తే కిలో వెండి ధర రూ.77,750 నుంచి రూ.760 తగ్గి రూ.76,990 వద్ద ముగిసింది. దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం స్పాట్ గోల్డ్ (24 క్యారట్స్) ధర రూ.875 తగ్గి రూ.66,575 వద్ద ముగిసిందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రీసెర్చ్ అనలిస్ట్ దిలీప్ కుమార్ చెప్పారు. గ్లోబల్ మార్కెట్లలో కామెక్స్లో స్పాట్ గోల్డ్ ఔన్స్ ధర 35 డాలర్లు క్షీణించి 2167 డాలర్ల వద్ద ముగిసింది.
బ్లింక్ ఎక్స్, జేఎం ఫైనాన్సియల్ (కమోడిటీ అండ్ కరెన్సీ) రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ ప్రణవ్ మెర్ స్పందిస్తూ.. `స్విస్ నేషనల్ బ్యాంకు వడ్డీరేట్లు తగ్గించడంతో డాలర్ ఇండెక్స్ తిరిగి పుంజుకున్నది. ఫలితంగా ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో గురువారం ధరతో పోలిస్తే దాదాపు రెండు శాతం తగ్గింది` అని తెలిపారు. ఔన్స్ వెండి ధర 25.51 డాలర్ల నుంచి 24.45 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతున్నది. అంతర్జాతీయంగా కామెక్స్లో ఔన్స్ స్పాట్ గోల్డ్కు 2145/2130 డాలర్ల వద్ద మద్దతు లభిస్తే, 2178/2206 డాలర్ల వద్ద ప్రతికూలత ఏర్పడుతుంది.
`మార్చి నెలలో బుల్లిష్గా సాగిన బంగారం ధరలు డాలర్ ఇండెక్స్ పుంజుకోవడంతో ఇన్వెస్టర్లు ప్రాఫిట్ల స్వీకరణ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణకు ప్రాధాన్యం ఇచ్చినా బంగారంపై పెట్టుబడులు సానుకూలమే. సమీప భవిష్యత్లో కొంత ఒడిదొడుకులు, సర్దుబాట్లు జరిగే అవకాశం ఉంది` అని ఎల్కేపీ సెక్యూరిటీస్ రీసెర్చ్ అనలిస్ట్, వైస్ప్రెసిడెంట్ జతిన్ త్రివేది చెప్పారు.