Gold-Silver Rates | అంతర్జాతీయ మార్కెట్లో బలహీన పరిస్థితుల నేపథ్యంలో దేశీయ బులియన్ మార్కెట్లో గురువారం బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో తులం బంగారం (24 క్యారెట్స్) ధర రూ.420 తగ్గి రూ.63,550 పలికిందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ తెలిపింది. బుధవారం రూ.63,970 వద్ద స్థిర పడింది. మరోవైపు కిలో వెండి ధర రూ.1900 పతనమై రూ.78,800 నుంచి రూ.76,900లకు పడిపోయింది. `అంతర్జాతీయ మార్కెట్లలో బేరిష్ ధోరణులతో గురువారం ఢిల్లీలో తులం బంగారం ధర (24 క్యారెట్స్) రూ.420 పతనమై రూ.63,550 పలికింది` అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమొడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. గ్లోబల్ మార్కెట్లలో ఔన్స్ బంగారం 2042 డాలర్లు, ఔన్స్ వెండి ధర 23.05 డాలర్లు పలికింది. వడ్డీరేట్లు తగ్గించాలన్న యూఎస్ ఫెడ్ రిజర్వు ప్లాన్ నేపథ్యంలో కామెక్స్ గోల్డ్ ధరలు రెండు వారాల కనిష్ట స్థాయికి పడిపోయాయన్నారు.
ఫ్యూచర్స్ మార్కెట్లో గురువారం బంగారం ధరలు రూ.267 పెరిగి రూ.62,774 వద్ద నిలిచాయి. మల్టీ కమొడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో ఫిబ్రవరి డెలివరీ బంగారం తులం ధర రూ.267 పెరిగి రూ.62,774 వద్ద స్థిర పడింది. గ్లోబల్ మార్కెట్లో న్యూయార్క్లో ఔన్స్ బంగారం ధర 2055 డాలర్లు పలికింది.
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఆభరణాల తయారీలో వినియోగించే 22 క్యారెట్స్ బంగారం తులం ధర రూ.400 పతనమై రూ.58,100 వద్ద నిలిచింది. 24 క్యారెట్స్ బంగారం తులం రూ.440 నష్టంతో రూ.63,380 వద్ద స్థిర పడింది. హైదరాబాద్ తోపాటు చెన్నైలో కిలో వెండి ధర రూ.2000 తగ్గి 78 వేల వద్ద నిలిచింది. చెన్నైలో ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్స్ బంగారం తులం ధర రూ.450 తగ్గి రూ.58,700 పలికితే, 24 క్యారెట్స్ బంగారం తులం ధర రూ.490 క్షీణించి రూ.64,040 వద్ద స్థిర పడింది.
పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్కతా, కర్ణాటక రాజధాని బెంగళూరు, మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్స్ బంగారం తులం ధర రూ.400 పతనంతో రూ.58,100, 24 క్యారెట్స్ బంగారం తులం ధర రూ.440 క్షీణించి రూ.63,380 వద్ద నిలిచింది. కిలో వెండి ధర రూ.2000 తగ్గి రూ.76,600 వద్ద స్థిర పడింది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.1500 పతనమై రూ.75 వేల వద్ద నిలిచింది. ముంబైలో కిలో వెండి ధర రూ.2000 క్షీణించి రూ.76,600 వద్ద నిలిచింది.