Gold Price | దేశీయంగా పెండ్లిండ్ల సీజన్.. అంతర్జాతీయంగా బలహీన పడిన అమెరికా డాలర్ ఇండెక్స్.. మాంద్యం ముప్పు ఉందన్న ఆందోళనల మధ్య బంగారం నిల్వలు పెంచుకుంటున్న వివిధ దేశాల కేంద్రీయ బ్యాంకులు.. ఆఫ్రికాలో బంగారం ఉత్పత్తి తగ్గిపోవడం వంటి కారణాలతో ఫలితంగా బులియన్ మార్కెట్లో 10 గ్రాముల (24 క్యారట్లు) బంగారం ధర రోజురోజుకు ధగధగ మెరిసిపోతున్నది. దేశ రాజధాని న్యూఢిల్లీలో వెండి రూ.70 వేల మార్క్ను దాటేసింది.
సోమవారం కోల్కతాలో మార్కెట్లో తులం (24 క్యారట్లు) బంగారం ధర రూ.57 వేల మార్క్ను దాటేసింది. కోల్కతాలో 10 గ్రాముల బంగారం ధర రూ.57,500 పలికింది. ఆభరణాల తయారీలో వినియోగించే 22 క్యారట్ల బంగారం తులం ధర రూ.54,550కి చేరుకున్నది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1916 డాలర్లు, ఔన్స్ వెండి ధర 24.22 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది.
తాజాగా బంగారం రోజురోజుకు పెరిగిపోవడానికి పలు కారణాలు కూడా ఉన్నాయి. దీపావళి పండుగకు ముందు డాలర్ ఇండెక్స్ 114 పాయింట్లపైనే ఉంది. కానీ ఇప్పుడు అది 102 పాయింట్లకు దిగి రావడంతో బంగారం కొనుగోలు చేయడానికి ఎక్కువ డాలర్లు ఖర్చు చేయాల్సి వస్తున్నది.
2022లో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల కేంద్రీయ బ్యాంకులు సుమారు 400 టన్నుల బంగారం కొనుగోలు చేశాయి. 2019 తర్వాత తొలిసారి చైనా గత నవంబర్లో 32 టన్నుల బంగారం కొని తన గోల్డ్ రిజర్వులను పెంచుకున్నది. అక్టోబర్లో బంగారం ఉత్పత్తి 10.4 శాతం తగ్గిందని సౌతాఫ్రికా నెడ్బ్యాంక్ ఎకనమిస్ట్లు తెలిపారు. అంతకుముందు సెప్టెంబర్లో గోల్డ్ మైనింగ్ 5.1 శాతం క్షీణించింది.
`అమెరికా ఫెడ్ రిజర్వు కీలక వడ్డీరేట్ల పెంపు ప్రక్రియను నెమ్మదిస్తుందన్న అంచనాల మధ్య బులియన్ మార్కెట్లో బంగారం దాదాపు తొమ్మిది నెలల గరిష్టానికి చేరుకున్నది. అమెరికా డాలర్ ఇండెక్స్ 2 శాతం, అమెరికా బాండ్లు 1.5 శాతం తక్కువన ట్రేడ్ అవుతున్నాయి` అని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్సియల్ సర్వీసెస్ కమొడిటీ రీసెర్చ్ సీనియర్ వైస్ప్రెసిడెంట్ నవ్నీత్ దమానీ చెప్పారు. మరోవైపు, చైనాలో నూతన సంవత్సర వేడుకలు ప్రారంభం కానున్న నేపథ్యంలో గతవారం బంగారం కొనుగోళ్లు పెరిగాయని పేర్కొన్నారు. పెరిగిన ధరలతో కన్జూమర్ సెంటిమెంట్ దెబ్బ తినకుండా భారతీయ బులియన్ ట్రేడర్లు భారీ డిస్కౌంట్లు ఆఫర్ చేస్తున్నారు.