న్యూఢిల్లీ: దేశంలో బంగారం ధరలు ( Gold price ) మళ్లీ పుంజుకుంటున్నాయి. ఇప్పటివరకు తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు గత రెండుమూడు రోజుల నుంచి వరుసగా పెరుగుతున్నాయి. 24 క్యారట్ బంగారం ఇవాళ ఏకంగా రూ.47 వేల మార్కును దాటింది. సోమవారం ఉదయం 9.20 గంటలకు మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్) మార్కెట్లో అక్టోబర్ గోల్డ్ కాంట్రాక్ట్లు 0.14 శాతం పుంజుకుని తులం 24 క్యారట్ బంగారం ధర రూ.47,006కు చేరింది. అయితే వెండి ధర మాత్రం ఇవాళ తగ్గింది. వెండి సెప్టెంబర్ ఫ్యూచర్ 0.06 శాతం పడిపోయి కిలో వెండి ధర రూ.63,203కు తగ్గింది.
అయితే బంగారం ధరలు భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉన్నదని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆఫ్ఘనిస్థాన్ పరిణమాలు దేశంలో బంగారం ధర పెరుగడానికి కారణమయ్యే అవకాశం ఉన్నదని వారు అంచనా వేస్తున్నారు. ఆఫ్ఘనిస్థాన్ను తాలిబన్లు ఆక్రమించుకున్నందువల్ల ఆ ప్రభావం అంతర్జాతీయ వాణిజ్యంపై పడుతుందని, ఆ ఎఫెక్ట్ కొన్ని నెలలపాటు కొనసాగే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఆఫ్ఘనిస్థాన్లో అధికారంలో చేజిక్కించుకున్న తాలిబన్లు తీసుకోబోయే నిర్ణయాలు గల్ఫ్ దేశాలను ప్రభావితం చేయనున్నాయని, దాంతో చమురు ధరల్లో హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటాయని నిపుణులు అంచనా కడుతున్నారు. అదేగనుక జరిగితే అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లు ఒడిదొడుకులకు లోనవుతాయని, దాంతో మదుపరులు సురక్షితమైనదిగా భావించి బంగారంపై పెట్టుబడులు పెడుతారని అంటున్నారు. దాంతో బంగారం ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.