న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: బంగారం మళ్లీ ప్రియమవుతున్నది. గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టిన పుత్తడి విలువ గురువారం ఏకంగా రూ.2 వేలు ఎగబాకింది. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఊపందుకోవడంతోపాటు డాలర్కు డిమాండ్ పడిపోవడంతో మదుపరులు తమ పెట్టుబడులను సురక్షితమైన అతి విలువైన లోహాల వైపు మళ్లించడంతో వీటి ధరలు పుంజుకున్నాయని ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వెల్లడించింది. న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల బంగారం ధర రూ.2 వేలు లేదా 1.31 శాతం అందుకొని రూ.1,54,800కి చేరుకున్నది.
అంతకుముందు ఇది రూ.1,52,800గా ఉన్నది. నెల కనిష్ఠ స్థాయికి పడిపోయిన గోల్డ్ ధరలు మళ్లీ పుంజుకున్నాయని, డాలర్ బలహీనపడటం, బాండ్ ఈల్డ్ తగ్గుముఖం పట్టడం కూడా ధరలు పెరుగడానికి ప్రధాన కారణాలని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. మరోవైపు, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. కిలో వెండి రూ.1,800 తగ్గి రూ.2,42,700కి దిగొచ్చింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో స్పాట్ గోల్డ్ 91.80 డాలర్లు లేదా 2 శాతం అందుకొని 4,635.52 డాలర్లకు చేరుకోగా, వెండి 3.31 శాతం ఎగబాకి 73.69 డాలర్లు పలికింది. అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతూ తీసుకున్న నిర్ణయం కూడా ధరలు పెరుగడానికి దోహదం చేశాయన్నారు.