Gold Price | హైదరాబాద్/న్యూఢిల్లీ, నవంబర్ 1: బంగారం ధరలు క్షీణిస్తున్నాయి. వరుసగా మూడోరోజూ పతనం చెందగా.. ఈ మూడు రోజుల్లో తులం రేటు రూ.1,100 దిగొచ్చింది. బుధవారం హైదరాబాద్లో మరో రూ.320 పడిపోయి 10 గ్రాముల 24 క్యారెట్ పుత్తడి విలువ రూ.61,530కి తగ్గింది. సోమ, మంగళవారాల్లోనూ రూ.230, రూ.550 చొప్పున దిగిన విషయం తెలిసిందే. 22 క్యారెట్ రేటు కూడా ఈ మూడు రోజుల్లో రూ.1,010 దిగజారి తులం రూ.56,400 వద్ద ఉన్నది. బుధవారం ఒక్కరోజే రూ.300 పడింది. మరోవైపు ఢిల్లీలోనూ రూ.350 తగ్గి 10 గ్రాముల మేలిమి పసిడి రూ.61,700 పలికింది.
వెండి ధరలూ నేలచూపుల్నే చూస్తున్నాయి. బుధవారం కిలో రేటు ఏకంగా రూ.1,200 క్షీణించింది. దీంతో రూ.77,000 వద్దకు వచ్చింది. మంగళవారం రూ.300 పడిన సంగతి విదితమే. ఢిల్లీలో రూ.74,300లుగా ఉన్నది. కాగా, అమెరికా డాలర్, బాండ్ ఈల్డ్స్ ఆకర్షణీయంగా మారుతున్నకొద్దీ పసిడి ధరలు పడిపోతున్నాయి. మదుపరులు తమ పెట్టుబడులను గోల్డ్ నుంచి మళ్లిస్తున్నట్టు నిపుణులు ట్రేడింగ్ సరళిని విశ్లేషిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లలో ఔన్సు బంగారం 1,978 డాలర్లుగా, వెండి 22.55 డాలర్లుగా ఉన్నది.