Gold Rate | విదేశీ వాణిజ్యంలో కరంట్ ఖాతా లోటు (క్యాడ్) భారం తగ్గించడానికి.. బంగారం దిగుమతిని నిరుత్సాహ పరిచేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. బంగారంపై దిగుమతి సుంకం ఐదు శాతం పెంచేసింది. సవరించిన దిగుమతి సుంకం గత నెల 30 నుంచి అమల్లోకి తెచ్చింది. గత మే నెలలో బంగారం దిగుమతులు 107 టన్నులకు చేరుకున్నాయి. జూన్ నెలలో దిగుమతులు గణనీయ స్థాయిలో పెరిగాయని భావించింది కేంద్రం. బంగారం దిగుమతి పెరగడంతో కరంట్ ఖాతా లోటుపై ఒత్తిడి పెరిగింది. దిగుమతి సుంకం పెంచడంతో దేశీయ బులియన్ మార్కెట్లో తులం బంగారం ధర రూ.2500 పెరుగుతుందని ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ అశీశ్ పెథే చెప్పారు. సుంకం పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి వెల్లడి కాగానే మల్టీ కమొడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో తులం బంగారం ధర 1433 పెరిగి రూ.51,950కి చేరుకున్నది.
ఇటీవల పెరిగిన బంగారం దిగుమతులు, అమెరికా డాలర్పై రూపాయి మారకం విలువ ఆల్టైం కనిష్ట స్థాయికి పడిపోవడంతో కరంట్ ఖాతా లోటుపై ఒత్తిడి పెరగడంతో బంగారం దిగుమతిపై సుంకం పెంచేసింది కేంద్రం. దిగుమతి సుంకం పెంపుతో కనీసం బంగారం ధర ఐదు శాతం పెరుగుతుందని బులియన్ మార్కెట్ వర్గాలు అంటున్నాయి.
దేశీయ మార్కెట్లో బంగారంపై దిగుమతి సుంకం మూడు భాగాలుగా ఉంటుంది. బేస్ ఇంపోర్ట్ డ్యూటీ 7.5 శాతం ఉంది. దానిపై ఐదు శాతం పెంచడంతో తాజాగా ప్రాథమిక దిగుమతి సుంకం 12.5 శాతానికి చేరుకున్నది. వ్యవసాయ మౌలిక వసతుల కల్పనకు సర్చార్జి 2.5 శాతంతోపాటు మూడు శాతం జీఎస్టీ అదనం. భవిష్యత్లో పది గ్రాముల బంగారం ధర రూ.2500 పెరుగుతుందని ఇండియన్ బులియన్ జ్యువెల్లర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ) జాతీయ కార్యదర్శి సురేంద్ర మెహతా తెలిపారు.