న్యూఢిల్లీ, మార్చి 13: రికార్డు స్థాయిలో దూసుకుపోయిన బంగారం ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. దేశీయంగా పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతున్నప్పటికీ అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పడిపోవడంతో పుత్తడి ధర రూ.66 వేల దిగువకు పడిపోయింది. ఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల బంగారం ధర రూ.400 తగ్గి రూ.65,950కి దిగింది. అంతకుముందు రూ.66,350గా ఉన్నది. అటు పసిడితోపాటు వెండి కూడా దిగొచ్చింది. రూ.600 తగ్గిన కిలో వెండి రూ.75,300కి తగ్గింది. ఇటు హైదరాబాద్లోనూ 24 క్యారెట్ తులం బంగారం ధర రూ.420 తగ్గి రూ.66,260 నుంచి రూ.65,840కి దిగొచ్చింది. 22 క్యారెట్ పుత్తడి ధర రూ.390 తగ్గి రూ.60,350గా నమోదైంది. బంగారంతోపాటు వెండి ఏకంగా రూ.1,000 తగ్గి రూ.79,500 నుంచి రూ.78,500కి తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 2,160 డాలర్లకు తగ్గింది. గత ముగింపుతో పోలిస్తే 17 డాలర్లు తగ్గింది. అలాగే వెండి 24.44 డాలర్ల నుంచి 24.22 డాలర్లకు దిగొచ్చింది. అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు అంచనాకంటే అధికంగా నమోదవడంతో వచ్చే సమీక్షలో ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలున్నాయన్న సంకేతాలతో గ్లోబల్ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు తగ్గుముఖం పట్టాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ వర్గాలు వెల్లడించాయి.