Gold Rates | అంతర్జాతీయ మార్కెట్లో పరిస్థితులకు అనుగుణంగా దేశీయ బులియన్ మార్కెట్లో శుక్రవారం కూడా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్స్ బంగారం తులం ధర రూ.100 తగ్గి రూ.63,450 వద్ద స్థిర పడిందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ తెలిపింది. గురువారం రూ.63,550 వద్ద ముగిసింది. అయితే, కిలో వెండి ధర యధాతథంగా రూ.76,900 వద్ద కొనసాగింది.
‘ఓవర్సీస్ మార్కెట్లలో బేరిష్ ధోరణుల నేపథ్యంలో ఢిల్లీలో స్పాట్ గోల్డ్ ధరలు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. ఫలితంగా తులం బంగారం (24 క్యారెట్స్) ధర రూ.100 తగ్గి రూ.63,450 వద్ద స్థిర పడింది’ అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమొడిటీ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 2040 డాలర్లు, ఔన్స్ వెండి ధర 23.03 డాలర్ల వద్ద కొనసాగింది. డాలర్ ఇండెక్స్, యూఎస్ ట్రెజరీ బాండ్ల విలువ పుంజుకోవడంతో బంగారం ధరలు ఒత్తిడికి గురవుతున్నాయని సౌమిల్ గాంధీ తెలిపారు.
ఢిల్లీలోని మల్టీ కమొడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో తులం బంగారం ఫిబ్రవరి కాంట్రాక్ట్స్ డెలివరీ ధర రూ.55 తగ్గి రూ.62,585 వద్ద కొనసాగింది. గ్లోబల్ మార్కెట్ (న్యూయార్క్)లో ఔన్స్ బంగారం ధర 0.03 శాతం పుంజుకుని 2050.70 డాలర్లు పలికింది.
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్, పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతా, మహారాష్ట్ర రాజధాని ముంబైలో 24 క్యారెట్స్ బంగారం తులం ధర రూ.110 తగ్గి రూ.63,270 వద్ద స్థిర పడింది. ఆభరణాల తయారీలో వినియోగించే 22 క్యారెట్స్ బంగారం తులం ధర రూ.100 క్షీణించి రూ.58 వేలకు పడిపోయింది. కిలో వెండి ధర రూ.78 వేల వద్ద యధాతథంగా కొనసాగుతున్నది. కోల్కతా, ముంబై నగరాల్లో కిలో వెండి ధర రూ.76,600 వద్ద స్థిర పడింది.
తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్స్ బంగారం తులం రూ.100 పతనమై రూ.58,600 వద్ద స్థిరంగా కొనసాగుతున్నది. 24 క్యారెట్స్ బంగారం ధర తులం రూ.110 తగ్గి రూ.63,930 వద్ద స్థిర పడింది. కిలో వెండి ధర రూ.78 వేలుగా కొనసాగుతున్నది.
కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో ఆభరణాల తయారీలో వినియోగించే 22 క్యారెట్స్ బంగారం తులం ధర రూ.100 తగ్గి రూ.58 వేల వద్ద స్థిర పడితే, 24 క్యారెట్స్ బంగారం తులం రూ.110 పతనమై రూ.63,270 వద్ద నిలిచింది. కిలో వెండి ధర రూ.1000 తగ్గి రూ.74 వేల వద్ద స్థిర పడింది.