న్యూఢిల్లీ, అక్టోబర్ 28 : బంగారం ధరలు మరింత తగ్గాయి. గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 4 వేల డాలర్ల దిగువకు పడిపోవడంతోపాటు అమెరికా-చైనా దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్త పరిస్థితులు తగ్గుముఖం పట్టడంతో దేశీయంగా ధరలు భారీగా తగ్గాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం బంగారం ధర రూ.4,100 తగ్గి రూ.1,21,800కి దిగొచ్చింది. సోమవారం ఈ ధర రూ.1,25,900గా నమోదైంది. అలాగే 99.5 శాతం స్వచ్ఛత కలిగిన పుత్తడి ధర ఇంతే స్థాయిలో తగ్గి రూ.1,21,200కి చేరుకున్నది. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన గోల్డ్ ధర మంగళవారం మూడు వారాల కనిష్ఠ స్థాయికి పడిపోయిందని ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వెల్లడించింది. పసిడితోపాటు వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. కిలో వెండి ఏకంగా రూ.6,250 తగ్గి రూ.1,45,000కి తగ్గింది. గత రెండు రోజుల్లో గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ ధర 200 డాలర్లకు పైగా తగ్గడంతో 3,887 డాలర్లకు పడిపోయింది. అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలుండటం కూడా పసిడి ధరలు తగ్గడానికి ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.
ఈ ఏడాది సెప్టెంబర్ ఆఖరునాటికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) దగ్గరున్న బంగారం నిల్వలు 880 మెట్రిక్ టన్నులకు చేరాయి. గడిచిన ఏడాది కాలంలో 25.45 మెట్రిక్ టన్నులు పెరిగినట్టు మంగళవారం 2025 ఏప్రిల్-సెప్టెంబర్ విదేశీ మారకపు నిల్వల నిర్వహణపై విడుదలైన ఆర్బీఐ అర్ధ వార్షిక నివేదిక తెలియజేసింది. గత ఏడాది సెప్టెంబర్ ఆఖర్లో ఆర్బీఐ వద్ద 854.73 మెట్రిక్ టన్నులుగా ఉన్న పసిడి నిల్వలు.. ఈ ఏడాది సెప్టెంబర్ చివరినాటికి 880.18 మెట్రిక్ టన్నులకు పెరిగాయి. ఇందులో 575.82 మెట్రిక్ టన్నులు దేశీయంగానే ఉండగా, మిగతా వాటిని విదేశాల్లో ఆర్బీఐ నిల్వ చేసింది. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ వద్ద 290.37 మెట్రిక్ టన్నులుండగా, 13.99 మెట్రిక్ టన్నులు గోల్డ్ డిపాజిట్ల రూపంలో ఉన్నాయి. ఈ సెప్టెంబర్ 30 నాటికి ఆర్బీఐ ఫారెక్స్ నిల్వల్లో బంగారం వాటా 13.92 శాతంగా ఉన్నది.