Gold Demand | బంగారం అంటే భారతీయులకు ఎంతో మక్కువ. ఇంట్లో జరిగే వివాహాది శుభాకార్యాలు, పండుగలకు పుత్తడిని కొనుగోలు చేస్తుంటారు. అయితే, ఇటీవల కాలంలో పసిడి ధరలు రికార్డు స్థాయికి చేరాయి. దాంతో సామాన్యులు బంగారం అంటేనే బాబోయ్ అనే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిస్థితుల్లో భారత్లో బంగారానికి డిమాండ్ తగ్గినట్లు తెలుస్తున్నది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో బంగారం అమ్మకాలు క్షీణించి 158.1 టన్నులకు చేరాయి. ప్రపంచంలో అత్యధికంగా బంగారం వినియోగించే దేశాల్లో భారత్ రెండోస్థానంలో ఉన్నది.
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ గణాంకాల ప్రకారం.. గతేడాదితో పోలిస్తే 2023 రెండో త్రైమాసికంలో బంగారం దిగుమతులు 16 నుంచి 209 టన్నులకు పెరిగాయి. ఈ ఏడాది తొలి ఆరు నెలల కాలంలో బంగారం డిమాండ్ 271 టన్నులుగా అంచనా. 2023 సంవత్సరంలో మొత్తంగా డిమాండ్ 650 నుంచి 750 టన్నుల మధ్య వరకు ఉన్నట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ గణాంకాలు పేర్కొన్నాయి. ఈ సందర్భంగా వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఇండియా రీజనల్ సీఈవో సోమ సుందర్భం మాట్లాడుతూ.. రెండో త్రైమాసికంలో బంగారం డిమాండ్ 7శాతం తగ్గిందని తెలిపారు. ప్రస్తుతం రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం ధరల నేపథ్యంలో డిమాండ్ తగ్గిందన్నారు. బంగారం ధరలు వినియోగదారుల సెంటిమెంట్పై గణనీయమైన ప్రభావాన్ని చూపుతున్నాయన్నారు. పది గ్రాముల బంగారం రూ.60వేల మార్క్ను దాటింది.
దేశంలో పన్ను వర్తింపు సైతం డిమాండ్లో కొంత తగ్గుదలకు కారణమైందని సోమసుందరం అభిప్రాయపడ్డారు. ఇక వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక ప్రకారం.. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో బంగారం డిమాండ్ ఏడుశాతం తగ్గి 170.7 టన్నుల నుంచి 157.1 టన్నులకు చేరింది. భారతదేశంలో బంగారం డిమాండ్ గత ఏడాది ఇదే కాలంలో రూ.79,270 కోట్ల నుంచి రెండో త్రైమాసికంలో 4శాతం పెరిగి రూ.82,530 కోట్లకు చేరుకుంది. అలాగే ఆభరణాల రూపంలో రెండో త్రైమాసికంలో 140.3 టన్నుల బంగారం అమ్ముడవగా.. ప్రధానంగా 18 క్యారెట్ల బంగారు ఆభరణాలకు డిమాండ్ కనిపించినట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక వివరించింది.