Gold Consumption | భారతీయులకు బంగారం ఆభరణాలంటే ఎంతో ఇష్టం.. పండుగకైనా.. కుటుంబ వేడుకకైనా బంగారం కొనడానికే మొగ్గుతారు. ఇంతకుముందుతో పోలిస్తే గత ఐదేండ్లలో మధ్య ఆదాయ వర్గాల కుటుంబాల్లోనే బంగారం కొనుగోళ్లు ఎక్కువగా ఉన్నాయి. రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల్లోపు ఆదాయం గల కుటుంబాలే 56 శాతం బంగారం కొనుగోళ్లు జరిపారు. అహ్మదాబాద్ ఐఐఎం ఆధ్వర్యంలోని ఇండియా గోల్డ్ పాలసీ సెంటర్ (ఐజీపీసీ) ఆధ్వర్యంలో జరిగిన సర్వే ప్రకారం వ్యక్తిగతంగా సంపన్నులే ఎక్కువగా బంగారం కొనుగోలు చేస్తున్నారు. మొత్తం దేశవ్యాప్తంగా బంగారం కొనుగోళ్లలో మధ్య ఆదాయ కుటుంబాలే ముందు ఉంటున్నాయి.
ఆదాయం పెరిగినా కొద్దీ వారంతా బంగారం సొంతం చేసుకోవడానికి మొగ్గుతున్నారు. ఉన్నతాదాయ వర్గాల కుటుంబాలు డిజిటల్ గోల్డ్ ఉత్పత్తుల కొనుగోలుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. మొత్తం బంగారం విక్రయాల్లో పట్టణ వాసులు సుమారు 70 శాతం ఉంటున్నారు. దీన్ని బట్టి పట్టణాలు, నగరాల్లో బంగారానికి గిరాకీ పెరుగుతున్నదని ఈ సర్వే చెబుతున్నది.
75 శాతం గృహిణులు ఏదో ఒక రూపంలో బంగారం కొనుగోలు చేస్తున్నారు. 43 శాతం మంది వివాహాల కోసమే బంగారం కొంటుండగా, 31 శాతం మంది సాధారణంగా.. ఎటువంటి అవసరం లేకున్నా ఆభరణాల కొనుగోలుకు మొగ్గుతున్నారు.
2016లో తీసుకొచ్చిన పాత పెద్ద నోట్ల రద్దు గానీ, తర్వాత అమల్లోకి తీసుకొచ్చిన జీఎస్టీ వల్ల గానీ బంగారం కొనుగోళ్లపై ప్రతికూల ప్రభావం పడలేదు. ఐదేండ్లుగా 74 శాతం మంది గృహిణులు బంగారం కొనుగోలు చేయడానికి మొగ్గుతున్నారు. 90 శాతం మంది నగదు చెల్లించి బంగారం కొనుగోలు చేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు.
2020-21తో పోలిస్తే 2021-22లో బంగారం దిగుమతులు 33.34 శాతం పెరిగి 46.14బిలియన్ డాలర్లకు పెరిగాయి. చైనా తర్వాత బంగారాన్ని దిగుమతి చేసుకునే దేశం ఇండియానే. బంగారం దిగుమతుల్లో అత్యధికం ఆభరణాల పరిశ్రమ వాటా ఉంటుంది. గత ఆర్థిక సంవత్సరంలో ఆభరణాల ఎగుమతులు సుమారు 50 శాతం పెరిగి 39 బిలియన్ డాలర్లకు చేరాయి.