న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: బంగారం, వెండి ధరలు మళ్లీ పరుగుపెట్టాయి. అక్షయ తృతీయ సందర్భంగా జ్యువెల్లరీలు, స్టాకిస్టులు ఎగబడి కొనుగోలు జరపడంతో దేశ రాజధాని న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో ఇరు అతి విలువైన లోహాల ధరలు 5 శాతం వరకు ఎగబాకాయి. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోలు ఊపందుకోవడంతో కిలో వెండి ఏకంగా రూ.11,800 లేదా 4.81 శాతం ఎగబాకి రూ.2.57 లక్షలకు చేరుకున్నది. సోమవారం ఈ ధర రూ.2,45,200గా ఉన్నది.
అలాగే 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల బంగా రం ధర రూ.3 వేలు లేదా 2 శాతం ఎగబాకి రూ.1.58 లక్షలకు చేరుకున్నది. అంతకుముందు ఇది రూ.1.55 లక్షలుగా ఉన్నది. ఈ నెల 19న అక్షయ తృతీయ సందర్భంగా విలువైన లోహాల కొనుగోలుకు శుభదినంగా పాటిస్తారు కనుక ఎగబడి కొనుగోలు జరుపుతారు. అంతర్జాతీయ మార్కెట్లో లోహాల ధరలు తగ్గుముఖం పట్టినప్పటికీ దేశీయంగా ధరలు పుంజుకోవడం విశేషం. ఔన్స్ గోల్డ్ ధర 45.88 డాలర్లు లేదా ఒక్క శాతం తగ్గి 4,795.97 డాలర్లకు తగ్గగా, వెండి 1.2 శాతం తగ్గి 78.61 డాలర్లకు దిగొచ్చింది.