గ్వాలియర్, నవంబర్ 15: జాతిపిత మహాత్మాగాంధీని కాల్చిచంపిన హంతకుడు నాథూరాం గాడ్సే వర్ధంతిని హిందూ మహాసభ ‘బలిదాన్ దివస్’గా నిర్వహించటం మధ్యప్రదేశ్లో కలకలం రేపింది. గ్వాలియర్లోని దౌలత్గంజ్లో ఉన్న హిందూ మహాసభ కార్యాలయంలో మంగళవారం ఈ కార్యక్రమం నిర్వహించారు. గాడ్సేకు ఘనంగా నివాళులు అర్పించారు. 1948 జనవరి 30 ఢిల్లీలో గాంధీని గాడ్సే తుపాకీతో అతి సమీపం నుంచి కాల్చి చంపాడు. ఈ నేరానికి గాడ్సేని 1949 నవంబర్ 15న అంబాలా జైల్లో ఉరితీశారు. గాడ్సేని ఉరితీసిన రోజును హిందూ మహాసభ సంతాపదినంగా, వీరోచితానికి ప్రతీక దినంగా నిర్వహిస్తూ వస్తున్నది. గ్వాలియర్లో గాడ్సే విగ్రహం కూడా ఏర్పాటుచేస్తామని హిందూ మహాసభ ప్రతినిధి అర్చనా చౌహాన్ తెలిపారు. ఈ కార్యక్రమంపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తంచేసింది. గాడ్సేని కీర్తించటం కచ్చితంగా దేశద్రోహ చర్యేనని, బాధ్యులపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదుచేయాలని మధ్యప్రదేశ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు అరుణ్యాదవ్ డిమాండ్ చేశారు.