హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోకి మరో భారీ పెట్టుబడి వచ్చింది. దేశంలోనే అతిపెద్ద ఆయిల్పామ్ ప్లాంటేషన్ కంపెనీ గోద్రేజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ రూ.250 కోట్ల పెట్టుబడితో ఖమ్మం జిల్లాలో అత్యాధునిక వంట నూనెల ప్రాసెసింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నది. దీంతో ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో 250 మందికి ప్రత్యక్షంగా, మరో 500 మందికి పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ ప్లాంటు ఉత్పాదక సామర్థ్యం గంటకు 30 టన్నులు (టీపీహెచ్).
భవిష్యత్తులో దీన్ని 60 టీపీహెచ్కు పెంచుకునే అవకాశాలున్నాయి. గోద్రేజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ ఎండీ బలరాం సింగ్ యాదవ్ నేతృత్వంలోని కంపెనీ ప్రతినిధి బృందం గురువారం ప్రగతిభవన్లో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావుతో సమావేశమైంది. ఖమ్మం జిల్లాలో ఇడిబుల్ ఆయిల్ ప్రాసెసింగ్ ప్లాంటును ఏర్పాటు చేయనున్నట్టు, తద్వారా ఆ జిల్లాతోపాటు పరిసర ప్రాంతాల్లోని పామాయిల్ ఉత్పత్తులను ప్రాసెస్ చేసేందుకు వీలు కలుగుతుందని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న పారిశ్రామిక విధానాలు అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు.
ఈ ప్లాంటు 2025-26లో ఉత్పత్తిలోకి రానున్నదని సంస్థ ప్రకటించింది. అలాగే ప్రస్తుత పెట్టుబడితోపాటు భవిష్యత్తులో తమ కార్యకలాపాలను విస్తరించేందుకు అనేక ప్రణాళికలున్నాయని బలరాం సింగ్ యాదవ్ మంత్రి కేటీఆర్కు చెప్పారు. తాము ఏర్పాటు చేయనున్న ప్లాంటుకు అవసరమయ్యే విద్యుత్తును తామే తయారు చేసుకునేందుకుగాను ప్రత్యేకంగా కో-జనరేషన్ ప్లాంట్ను కూడా ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు. పామాయిల్ సాగుచేస్తున్న రైతులకు సూచనలు, సలహాలు అందించేందుకు శాటిలైట్, డ్రోన్ ట్రాకింగ్, మొబైల్ యాప్ వంటి అధునాతన సౌకర్యాలను వినియోగిస్తున్నామన్నారు.
తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నదని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా తెలిపారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఓ రైతేనని గుర్తుచేశారు. అందుకే రైతుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టారని చెప్పారు. సంప్రదాయక పంటలతోనే సరిపెట్టకుండా, వాణిజ్య పంటలవైపు రైతులను నడిపించేందుకు తెలంగాణలో 20 లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగు చేయాలన్న లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తున్నదన్నారు. పామాయిల్ సాగుతో దేశంలో వంటనూనెల దిగుమతులు తగ్గి స్వావలంభన సాధించే అవకాశం కలుగుతుందన్నారు. ఈ రంగంలోని అవకాశాలను దృష్టిలో ఉంచుకొనే ఆయిల్పామ్ సాగుపై ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్టు తెలియజేశారు. తెలంగాణ ప్రభుత్వం కృషి ఫలితంగా రాష్ట్రంలో యెల్లో రెవల్యూషన్ (ఆయిల్ పంటల విప్లవం) సాధ్యమవుతుందన్న నమ్మకాన్ని కనబర్చారు. ఈ క్రమంలోనే ఈ రంగంలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పరిశ్రమను మంత్రి కేటీఆర్ కోరారు.