హైదరాబాద్, మే 27: హిందుజా గ్రూపునకు చెందిన జీవోసీఎల్ కార్పొరేషన్ లిమిటెడ్ గడిచిన ఆర్థిక సంవత్సరం మొత్తానికి రూ.623 కోట్ల కన్సాలిడేటెడ్ ఆదాయంపై రూ.163 కోట్ల నికర లాభాన్ని గడించింది. అలాగే రూ.2 ముఖ విలువ కలిగిన ప్రతిషేరుకు రూ.3 లేదా 150 శాతం తుది డివిడెండ్ను కంపెనీ బోర్డు ప్రకటించింది. దీంతో గతేడాది మొత్తానికి రూ.5 (250 శాతం) డివిడెండ్ చెల్లించినట్లు అయింది. ఈ సందర్భంగా కంపెనీ సీఈవో పంకజ్ కుమార్ మాట్లాడుతూ..తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించినట్లు చెప్పారు. ప్రస్తుతం కంపెనీ వద్ద రూ.1,300 కోట్ల విలువైన ఆర్డర్లు ఉన్నాయని, వచ్చే రెండేండ్ల వరకు ఎలాంటి ఢోకా లేదని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే, హైదరాబాద్లోని కూకట్పల్లి వద్ద ఉన్న 44 ఎకరాల స్థలాన్ని రూ.451 కోట్లకు విక్రయిస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించి కొనుగోలు చేసిన సంస్థతో ఒప్పందాన్ని కూడా కుదుర్చుకున్నట్లు పేర్కొంది.