న్యూఢిల్లీ, ఆగస్టు 28: భారతీయ బహుళజాతి మౌలిక రంగ దిగ్గజం జీఎమ్మార్ గ్రూప్ అంతర్జాతీయంగా ఉన్న మరిన్ని అవకాశాలపై దృష్టి పెడుతున్నది. పశ్చిమ, సెంట్రల్, ఆగ్నేయాసియా దేశాలతోపాటు తూర్పు ఐరోపా దేశాల్లో విమానాశ్రయాలు, వాటి అనుబంధ వ్యాపారాల్లోగల ప్రధాన అవకాశాలను అన్వేషిస్తున్నట్టు జీఎమ్మార్ గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్ గ్రంధి మల్లికార్జున రావు తెలిపారు. ఎయిర్పోర్టులు, ఎనర్జీ, రహదారులు, పట్టణ మౌలికాభివృద్ధి రంగాల్లో జీఎమ్మార్ గ్రూప్ సేవలందిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఢిల్లీ, హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా 6 విమానాశ్రయాలను జీఎమ్మార్ ఎయిర్పోర్ట్స్ నిర్వహిస్తున్నది. దీనికి ఇండోనేషియాలోనూ ఓ ఎయిర్పోర్టుండగా.. గ్రీస్లో మరో ఎయిర్పోర్టును అభివృద్ధి చేస్తున్నది.
ఇక ఈ నెల 17న ఆంధ్రప్రదేశ్లోని భోగాపురం ఎయిర్పోర్టులో కార్యకలాపాలనూ ఆరంభించింది. ఈ నేపథ్యంలో గత ఆర్థిక సంవత్సరానికి (2025-26)గాను తాజాగా విడుదలైన వార్షిక నివేదికలో జీఎం రావు తన సందేశాన్నిచ్చారు. ప్రభుత్వ ప్రగతిదాయక నిర్ణయాలు, మెరుగవుతున్న విమానయాన మౌలిక సదుపాయాలు, విస్తరిస్తున్న పర్యాటక రంగం, పెరుగుతున్న ప్రజల ఆదాయాలతో భారతీయ విమానయాన దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలపట్ల విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి తమ ఎయిర్పోర్ట్ ప్లాట్ఫామ్ పోర్ట్ఫోలియోను డ్యూటీ ఫ్రీ, కార్గో, రిటైల్, ఫుడ్, బేవరేజ్ వంటి ఎయిర్పోర్ట్ అనుబంధ వ్యాపారాల్లోకి విస్తరిస్తున్నామని చెప్పారు. కాగా, 2025-26లో జీఎమ్మార్ ఎయిర్పోర్ట్స్ దేశీయంగా 11.46 కోట్ల ప్రయాణికులకు సేవలందించింది.