న్యూఢిల్లీ, జూన్ 18: మరోసారి ఆర్థిక సంక్షోభం రాబోతున్నాదా! ప్రపంచం మాంద్యం బారిన పడబోతున్నదా! రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధంతో ఇప్పటికే భారీగా నష్టపోయిన ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థకు మళ్లీ చిల్లులుపడబోతున్నాయా! ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇది నిజమేననిపిస్తున్నది. గడిచిన పదిహేను రోజులుగా ప్రపంచ దేశాల సెంట్రల్ బ్యాంక్లు క్రమంగా ఒక్కోక్కటి వడ్డీరేట్లను పెంచుతున్నాయి. ద్రవ్యోల్బణం గరిష్ఠ స్థాయికి చేరుకున్నదన్న సాకుగా చూపెడుతూ అన్ని బ్యాంకులు వడ్డీరేట్లను ఒక్క శాతం వరకు పెంచేశాయి. ఈ నిర్ణయాలతో ఇన్వెస్టర్లలో ఆందోళన తీవ్రస్థాయికి చేరుకున్నది.
కరోనా సంక్షోభం తర్వాత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఇన్వెస్టర్లకు వడ్డీరేట్ల పెంపు నిర్ణయం రుచించడం లేదు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. ఈవారంలో సూచీలు 10 శాతం వరకు పతనమయ్యాయంటే ఆందోళన ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చును. 2020 నుంచి ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు అంతంత మాత్రంగానే ఉండటంతో సెంట్రల్ బ్యాంక్లు వడ్డీరేట్లను ముట్టుకోలేదు. కొద్ది నెలలుగా ద్రవ్యోల్బణం కోరలు చాస్తుండటంతో సెంట్రల్ బ్యాంకులు దీనిని కట్టడి చేయడానికి వడ్డీరేట్ల పెంపును తెరపైకి తీసుకొచ్చాయి.
ఏడాది కనిష్ఠానికి దేశీయ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. గత ఐదు సెషన్లలో 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 3,500 పాయింట్లకు పైగా పతనం చెందింది. 2020 తర్వాత ఒక వారంలో ఇంతటి స్థాయిలో పతనమవడం ఇదే తొలిసారి. దీంతో సూచీ ఏడాది కనిష్ఠ స్థాయికి జారుకున్నట్లు అయింది. బ్లూచిప్ సంస్థల షేర్లు కుప్పకూలడంతో సూచీ 5.5 శాతం వరకు పతనం చెందింది. 2008లో వచ్చిన సంక్షోభం స్థాయిలో మరోసారి ఆర్థిక సంక్షోభం రాబోతున్నదన్న అనుమానాల్ని ఇన్వెస్టర్లు వ్యక్తంచేస్తున్నారు.
అమెరికా మార్కెట్లదీ అదే తీరు
అగ్రరాజ్యం అమెరికా మార్కెట్లు కూడా భారీగా నష్టపోతున్నాయి. ఈవారంలో ఎస్అండ్పీ 500 సూచీ 5.8 శాతం మేర నష్టపోయింది. 2020 తర్వాత ఒక వారంలో ఇంతటి స్థాయిలో క్షీణించడం ఇదే తొలిసారి. మరోవైపు చైనా సూచీలు కూడా తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. ద్రవ్యోల్బణం అదుపు చేయడానికి ఆ దేశం తీసుకుంటున్న చర్యలకు తోడు కరోనా కట్టడికి లాక్డౌన్ ప్రకటించడంతో సూచీలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాయని బ్యాంక్ ఆఫ్ అమెరికా ఆర్థిక వేత్త వెల్లడించారు. మరోసారి మాంద్యం అమెరికా నుంచి రావచ్చోని, 40 శాతం అవకాశాలు ఇక్కడి నుంచే ఉన్నాయని ఆయన చెప్పారు. ఫెడరల్ రిజర్వు క్రమంగా వడ్డీరేట్లను పెంచడంతో ఈ అనుమానం కలుగుతున్నదన్నారు. యూఎస్ జీడీపీ సున్న శాతానికి చేరుతుందన్న అంచనాలు, ద్రవ్యోల్బణం 8.6 శాతానికి చేరుకోవడం ప్రపంచ దేశాల్ని ఆందోళనకు గురి చేస్తున్నది. 1994 తర్వాత యూఎస్ వడ్డీరేట్లను ఒకేసారి భారీగా పెంచడం, మరోవైపు స్విట్జర్లాండ్ 16 సంవత్సరాల తర్వాత రేట్ల పెంపు చేపట్టడం, డిసెంబర్ నుంచి బ్రిటన్ వడ్డీరేట్లను ఐదు సార్లు సవరించడం, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ వడ్డీరేట్లను పెంచడానికి సిద్ధమవుతుండటం ఈక్విటీ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి.