అదో పల్లెటూరు. ఊర్లో ప్రతీసారి పంట కోతలు జరిగాక, ఆ ధాన్యపు రాశిని కనిపించని శక్తేదో రాత్రికి రాత్రి మింగేసేది. దీంతో రైతన్నలు లబోదిబోమనేవారు.
గ్రామంలోని పెద్దమనుషులు అంతా కలిసి రాత్రిళ్లు ఐదారుగురు యువకులతో కాపలా పెట్టించినా ఫలితం లేకుండా పోయింది. కొన్ని రోజులు గడిచాయి. పట్నం నుంచి వచ్చిన ఓ యువకుడికి అసలు విషయం అర్థం కావడానికి ఎంతో కాలం పట్టలేదు.
రాత్రిళ్లు ధాన్యాన్ని దారిమళ్లిస్తున్న అదృశ్య శక్తి.. సర్పంచీ, ఆయన పరీవారమేనని బయటపెట్టాడు. గుట్టురట్టవడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే అప్పటి నుంచి ఆ పల్లెటూరును దొంగల గ్రామంగా ముద్రవేస్తూ.. పొరుగునున్నవారు అప్రకటిత నిషేధం విధించారు. తప్పు చేసింది ఒకరైతే.. దాని ప్రభావం ఆ గ్రామస్తులపై పడింది.
అదానీ గ్రూప్ ఆర్థిక అవకతవకల వ్యవహారం కూడా ఇప్పుడు ఇలాగే ఉన్నది. ఆర్థిక ప్రయోజనాల కోసం ఓ ప్రైవేట్ కంపెనీ తప్పు చేస్తే.. ఆ ప్రభావం యావత్తు జాతి, దేశ ప్రగతి మీదపడే దుస్థితి దాపురించింది. అంతర్జాతీయ పత్రిక బ్లూంబర్గ్.. ‘అదానీ 108 బిలియన్ డాలర్ క్రైసిస్ షేక్స్ ఇన్వెస్టర్స్ ఫెయిత్ ఇన్ ఇండియా’ పేరిట ఓ కథనాన్ని ప్రచురించింది.
(స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): ‘భారత్ మారింది. మా దేశానికి వచ్చి ఆ మార్పును మీ కండ్లతోనే చూడండి. ప్రపంచానికే మేం కేంద్ర బిందువుగా మారుతున్నాం. పెట్టుబడులు పెట్టడానికి మా దేశానికి రండి’.. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి ఒకానొక సందర్భంలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలివి. నిజమే. ఎనిమిదిన్నరేండ్ల బీజేపీ హయాంలో భారత్ మారిపోయింది. దేశానికి వచ్చి చూస్తే, ప్రతీ ఒక్కరికి ఆ మార్పు ఏమిటో స్పష్టంగా కనిపిస్తుంది. అదానీ గ్రూప్ ఆర్థిక అవకతవకలతో ప్రపంచ కార్పొరేట్ చరిత్రలో ఇప్పుడు భారత్ నిజంగానే కేంద్ర బిందువుగా మారిపోయింది. ఎంతలా అంటే.. భారత్లో పెట్టుబడులు పెట్టడానికి గ్లోబల్ ఇన్వెస్టర్లు ఒకటికి రెండుసార్లు పునరాలోచించుకొనే పరిస్థితి ఏర్పడింది. ఈ మేరకు అంతర్జాతీయ పత్రిక ‘బ్లూమ్బర్గ్’ ఓ కథనాన్ని ప్రచురించింది.
పెట్టుబడులు చైనాకు వెళ్తాయా?..
అదానీ గ్రూప్ తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతున్నదంటూ పరిశోధక సంస్థ ‘హిండెన్బర్గ్’ రీసెర్చ్ 14 రోజుల క్రితం చేసిన ఆరోపణలతో అదానీ గ్రూప్ సంపద రూ.10 లక్షల కోట్ల వరకూ ఆవిరైంది. అయితే అదానీ గ్రూప్ చేసిన ఆర్థిక అవకతవకలు ఒక్క ఆ గ్రూప్నే కాకుండా యావత్తు దేశ ఆర్థిక వ్యవస్థనే కుప్పకూల్చేలా తయారవుతున్నది. కారణం.. అదానీ ఉదంతంతో భారత ఆర్థిక విధానాలు, కేంద్ర సర్కారు రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్పై అంతర్జాతీయ కంపెనీలకు చెందిన పలువురు అధిపతులు అనుమానాలు వ్యక్తం చేయడమే. ఈ క్రమంలోనే చైనాలో కరోనా కేసులు తిరిగి నియంత్రణలోకి వచ్చి, వ్యాపార లావాదేవీలు ప్రారంభమైతే, పెట్టుబడులు అటువైపునకు మళ్లొచ్చని అభిప్రాయపడుతున్నారు. హెచ్ఎస్బీసీ హోల్డిం గ్స్, యాపిల్ తదితర కంపెనీలను ఈ మేరకు ఉదహరిస్తున్నారు. విదేశీ పెట్టుబడులు చైనాకు మళ్లడం జరిగితే, దేశంలో నిరుద్యోగం పెచ్చరిల్లడం ఖాయం. దీంతోపాటు దేశ ఆర్థిక వ్యవస్థ, జీడీపీ వృద్ధిరేటుపై గణనీయంగా ప్రభావం ఉండొచ్చని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
8 కేసులు వేశారు: పరాంజయ్ గుహా
అదానీ గ్రూప్ ఉదంతంపై ప్రముఖ జర్నలిస్ట్ పరాంజయ్ గుహా తాజాగా స్పందించారు. ఈ మేరకు టెలిగ్రాఫ్ ఆన్లైన్కు ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. హిండెన్బర్గ్ రిపోర్ట్లో తన పేరు ఉండటంపై ఆయన మాట్లాడారు. రిపోర్ట్ వచ్చే వరకూ తన పేరు విషయం తెలియదన్నారు. అదానీ గ్రూప్లో అవకతవకలు జరుగుతున్నట్టు 2017కు ముందే తాను వెల్లడించినట్టు గుర్తుచేశారు. రెండుసార్లు గౌతమ్ అదానీతో తాను మాట్లాడానని, తన కంపెనీలకు నష్టం కలిగించేలా వార్తలు రాస్తున్నానంటూ తనపై అదానీ గ్రూప్ ఏడెనిమిది కేసులు వేసినట్టు తెలిపారు. అయితే, ఇప్పటివరకూ తాను అరెస్టు కాలేదన్నారు.
అదానీ గ్రూప్నకు లబ్ధి చేకూర్చేందుకు స్పెషల్ ఎకనమిక్ జోన్ (సెజ్) నిబంధనలనే మోదీ సర్కారు మార్చేసిందని పరాంజయ్ గుహా 2017లో తెలిపారు. తద్వారా అదానీకి రూ.500 కోట్ల ప్రయోజనం చేకూరిందన్నారు. నిజానికి పరాంజయ్పై అదానీ గ్రూప్ పరువు నష్టందావా వేసి ఇబ్బందులకు గురిచేసింది. దీంతో అదానీ గ్రూప్పై ఎలాంటి వ్యాఖ్యలుగానీ, వ్యాసాలుగానీ రాయవద్దని అహ్మదాబాద్ కోర్టు ఆంక్షలు విధించింది. ఫలితంగా రెండున్నరేండ్లపాటు అదానీ వ్యవహారంపై మౌనంగా ఉన్న పరాంజయ్ తాజాగా ఈ వ్యాఖ్యలు చేశారు.
సెబీ చైర్పర్సన్తో గౌతమ్ అదానీ భేటీ!
స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ చైర్పర్సన్తో అదానీ గ్రూపు అధినేత గౌతమ్ అదానీ భేటీ అయినట్లు తెలుస్తున్నది. ముంబైలోని సెబీ ప్రధాన కార్యాలయంలోనే ఆయన భేటీ అయినట్లు ప్రముఖ మీడియా సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. గతేడాది అక్టోబర్లోనూ ఆయన సెబీ చైర్పర్సన్ మాదాబీ పూరి బచ్తో సమావేశమైన విషయం తెలిసిందే. గడిచిన ఐదు నెలల్లో సమావేశం కావడం ఇది రెండోసారి కావడం విశేషం.
పునరాలోచనలో పెట్టుబడిదారులు
మార్కెట్లో పరిస్థితులు అత్యంత వేగంగా మారిపోతుంటాయి. అదానీ ఉదంతంతో భారత్లో పెట్టుబడులు పెట్టాలనుకొన్న విదేశీ ఇన్వెస్టర్లు ఇప్పుడు పునరాలోచనలో పడ్డారు. కేంద్ర ప్రభుత్వ పాలన, కార్పొరేట్ రంగంలో పారదర్శకత, బంధు ప్రీతి, రుణాలు వంటి విషయాలు కూడా ఇందుకు దోహదం చేస్తున్నాయి.
-గ్యారీ డుగాన్, సీఈవో,గ్లోబల్ సీఐవో ఆఫీస్, సింగపూర్
స్పష్టంగా అన్నీ గమనిస్తున్నారు
కరోనా సంక్షోభం నుంచి కోలుకొని, ఆర్థిక కార్యకలాపాలను చైనా ఇప్పుడిప్పుడే మళ్లీ ప్రారంభిస్తున్నది. ఇలాంటి సమయంలో అదానీ గ్రూప్లో అవకతవకల వ్యవహారం భారత్కు నష్టదాయకమే. విదేశీ పెట్టుబడిదారులు ఈ పరిణామాలను స్పష్టంగా గమనిస్తున్నారు.
-అలీసియా గార్సియా హెరేరో, నాటిక్సిస్ ఎస్ఏలో (ఆసియా-పసిఫిక్) ప్రధాన ఆర్థికవేత్త
భారత్ స్థాయిలో తగ్గుదల
అదానీ ఉదంతం భారత్లో పెట్టుబడులపై దుష్ప్రభావాన్ని కలుగజేస్తున్నది. దీంతో ఇండియన్ కంపెనీ స్టాక్లను కొనుగోలు చేసే విదేశీ పెట్టుబడిదారుల సంఖ్య తగ్గొచ్చు. తాజా ఘటనతో ఇండియన్ స్టాక్ మార్కెట్లు గణనీయంగా కుప్పకూలనప్పటికీ, చైనా వంటి ఆసియా దేశాల మార్కెట్లతో పోలిస్తే, భారత్ స్థాయి తగ్గుతూ వస్తున్నది.
-జియాన్ షి కోర్టెసీ, ఫండ్ మేనేజర్, జీఏఎం ఇన్వెస్ట్మెంట్స్
మోదీపై నమ్మకం సడలుతున్నది
అదానీ ఘటనతో విదేశీ పెట్టుబడులపై ప్రభావం ఉంటుందని కచ్చితంగా చెప్పవచ్చు. అంతేకాదు ఈ ఉదంతంతో ప్రధాని మోదీపై నమ్మకం కూడా సడలుతున్నది.
-మోహన్ గురుస్వామి, కేంద్ర ఆర్థిక శాఖ మాజీ సలహాదారు