హైదరాబాద్, డిసెంబర్ 13: గ్లాండ్ ఫార్మాను చేజిక్కించుకొనేందుకు విదేశీ ఫండ్ మేనేజర్లు పోటీ పడుతున్నారు. ఈ హైదరాబాదీ ఔషధ రంగ సంస్థలో తమకున్న మెజారిటీ వాటాను అమ్మేందుకు ఫోసున్ కంపెనీ సిద్ధమైంది. దీంతో అడ్వెంట్ ఇంటర్నేషనల్, బారింగ్ ప్రైవేట్ ఈక్విటీ ఆసియా, బెయిన్ క్యాపిటల్, బ్లాక్స్టోన్, కార్లీలే, కేకేఆర్ తదితర బహుళజాతి ప్రైవేట్ ఈక్విటీ కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయి.
భారతీయ జనరిక్ ఇంజెక్టబుల్ తయారీదారు గ్లాండ్ ఫార్మాలో ప్రస్తుతం చైనాకు చెందిన ఫోసున్కు 57.86 శాతం వాటా ఉన్నది. 2017లో 1.1 బిలియన్ డాలర్లతో ఈ వాటాను ఫోసున్ సొంతం చేసుకున్నది. ఇక 2020లో రూ.6,480 కోట్ల ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)తో దేశీయ స్టాక్ మార్కెట్లలోకి గ్లాండ్ ఫార్మా అడుగు పెట్టిన విషయం తెలిసిందే. 44 ఏండ్ల కిందట 1978లో హైదరాబాద్ కేంద్రంగా గ్లాండ్ ఫార్మా ఏర్పాటైన సంగతీ విదితమే.
అప్పుల కోసమేనా..
ఫోసున్ సంస్థ ఇప్పుడు పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయింది. చైనా స్థిరాస్తి రంగంలో నెలకొన్న స్తబ్ధత.. ఫోసున్ను పెద్ద ఎత్తునే ప్రభావితం చేస్తున్నది. ఈ క్రమంలోనే రుణాలిచ్చిన బ్యాంకులు తమ అప్పుల్ని తీర్చేయాలని ఫోసున్పై ఒత్తిడి చేస్తున్నాయి. దీంతోనే గ్లాండ్ ఫార్మా వాటాను అమ్మేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఇప్పటికే కొనుగోలుదారులను వెతికేందుకు మోర్గాన్ స్టాన్లీని కూడా ఫోసున్ రంగంలోకి దించింది.
డీల్ కుదిరితే దేశీయ ఔషధ రంగంలోనే అతిపెద్ద లావాదేవీగా రికార్డులకెక్కనున్నదన్న వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. డీల్ విలువ ఎంతన్నది ఇప్పుడే తెలియకపోయినా.. భారీ మొత్తంలోనే ఈ లావాదేవీ జరుగుతుందని మాత్రం అంచనా వేస్తున్నారు. కాగా, గ్లాండ్ ఫార్మా బీ2బీ కంపెనీగా ఉన్నది. దీంతో ఫోసున్ నుంచి విదేశీ ఈక్విటీ ఫండ్ల చేతికి గ్లాండ్ ఫార్మా వెళ్తే.. సన్ ఫార్మా, సిప్లా వంటి భారతీయ సంస్థలకు మార్కెట్లో పోటీ మరింత తీవ్రం కానున్నది. ప్రత్యర్థి సంస్థలకూ గ్లాండ్ ఫార్మా నుంచి ముడి పదార్థాల సరఫరాలు జరిగే వీలుండటమే ఇందుకు కారణమని విశ్లేషిస్తున్నారు.