వాషింగ్టన్, డిసెంబర్ 3: అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) ప్రధాన ఆర్థికవేత్త, ఇండో-అమెరికన్ గీతా గోపీనాథ్కు పదోన్నతి లభించింది. ఐఎంఎఫ్ ఫస్ట్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ (ఎఫ్డీఎండీ)గా ఎన్నికయ్యారు. ఐఎంఎఫ్లో ఎండీ తర్వాత ఇదే అగ్రస్థానం అవగా, ఇప్పుడు ఓ భారతీయురాలికి ఈ గౌరవం దక్కడం విశేషం. ప్రస్తుత ఎఫ్డీఎండీ జాఫ్రీ ఒకమోటో వచ్చే ఏడాది దిగిపోతుండగా, ఆయన స్థానంలో గీతా గోపీనాథ్ బాధ్యతల్లోకి రానున్నారు. ‘జాఫ్రీ, గీతా ఇద్దరూ గొప్ప సహచరులు. జాఫ్రీ వెళ్లిపోతున్నందుకు నాకు ఓ వైపు చాలా బాధగా ఉన్నా.. మరోవైపు గీతా ఎఫ్డీఎండీగా వస్తున్నందుకు సంతోషంగా కూడా ఉన్నది’ అని ఐఎంఎఫ్ ఎండీ క్రిస్టాలినా జార్జియెవా తాజా సందేశంలో అన్నారు. 49 ఏండ్ల గీతా గోపీనాథ్.. ఐఎంఎఫ్ తొలి మహిళా ప్రధాన ఆర్థికవేత్తగా మూడేండ్లకుగాను ఎంపికైన విషయం తెలిసిందే. పదవీకాలం ముగిసిపోతుండటంతో వచ్చే నెల హార్వర్డ్ యూనివర్సిటీలో మళ్లీ అధ్యాపకురాలిగా చేరాల్సి ఉన్నది. అయితే ఎఫ్డీఎండీ హోదా లభించడంతో కొనసాగాలని నిర్ణయించుకున్నారు. ఐఎంఎఫ్లో భారత్తోసహా 190 దేశాలకు సభ్యత్వం ఉన్నది.