ముంబై, డిసెంబర్ 30: ఆభరణాల ఎగుమతులు తగ్గుముఖం పట్టాయి. నవంబర్ నెలలో రూ.19,018.18 కోట్ల విలువైన జెమ్స్ అండ్ జ్యూవెల్లరీ ఎగుమతి అయ్యాయని జీజేఈపీసీ వెల్లడించింది. క్రితం ఏడాది ఇదే నెలలో ఎగుమతి అయిన రూ.19,917 కోట్ల కంటే ఇది 4.52 శాతం తక్కువని జెమ్ అండ్ జ్యూవెల్లరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్(జీజేఈపీసీ) విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.
సరఫరా వ్యవస్థలో అవాంతరాలు ఎదురవడం వల్లనే ఎగుమతులు తగ్గాయని పేర్కొంది. డైమండ్ల దిగుమతులపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న రాజకీయ అనిశ్చితితో ఆభరణాలకు డిమాండ్ పడిపోయిందని జీజేఈపీసీ చైర్మన్ విపుల్ షా తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి ఆభరణాల ఎగుమతులు పుంజుకునే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు.