PM Modi | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా ధరలు భగ్గుమంటున్నాయి. లక్షలాది పరిశ్రమలు మూతబడ్డాయి. ఉత్పాదకత క్షీణించింది. నిరుద్యోగం తాండవిస్తున్నది. ఎగుమతులు ఢీలా పడిపోయాయి. విదేశీ మారకం నిల్వలు నిండుకొన్నాయి. వాణిజ్యలోటు అంతకంతకూ పెరిగిపోతున్నది. రూపాయి విలువ అధఃపాతాళానికి పడిపోతున్నది. అయినప్పటికీ.. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు 7.8 శాతంగా నమోదైనట్టు జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్వో) ఏప్రిల్-జూన్కు సంబంధించి ఈ గణాంకాలను ఇటీవల వెలువరించింది. తమ ప్రభుత్వం అమలుచేస్తున్న విప్లవాత్మకమైన సంస్కరణల కారణంగానే దేశం వృద్ధిపథంలో పరుగులు పెడుతున్నదంటూ బీజేపీపరీవారం గప్పాలకు పోయింది. అయితే, వృద్ధిరేటుకు సంబంధించి లోగుట్టును ప్రఖ్యాత ఆర్థికవేత్త అశోక మోదీ తాజాగా వివరించారు.
దేశవ్యాప్తంగా ఆహారోత్పత్తుల ధరలు భగ్గుమంటున్నాయి. దీన్ని ధ్రువపరుస్తూ జూలైలో రిటైల్ ధరల సూచీ దాదాపు 15 నెలల గరిష్ఠస్థాయి 7.44 శాతానికి చేరింది.
దేశంలో నిరుద్యోగిత రేటు 7.9 శాతంగా నమోదైంది. అర్హతలకు తగిన ఉద్యోగాల కోసం 22 కోట్లమంది వేచిచూస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి.
రోజుకు 300 చొప్పున తొమ్మిదేండ్ల మోదీపాలనలో ఏకంగా 10 లక్షల చిన్న, మధ్యతరహా పరిశ్రమలు మూతబడ్డట్టు నివేదికలు చెబుతున్నాయి.
గడిచిన మూడేండ్లలో ఎన్నడూలేనంతగా ఈ ఏడాది జూలై నెలలో భారత్ నుంచి ఆయా దేశాలకు జరిగిన ఎగుమతులు దారుణంగా పడిపోయాయి. ఫలితంగా ఆ నెలలో ఎగుమతులు గతంతో పోలిస్తే ఏకంగా 23 శాతం క్షీణించి 32.25 బిలియన్ డాలర్లకు తగ్గాయి.
దేశ ఎగుమతులు, దిగుమతుల మధ్య అంతరం ఎంతకూ దిగిరావడంలేదు. దీంతో వాణిజ్యలోటు ఏడాదిన్నర వ్యవధిలో మూడింతలైంది. గత జూలైలో వాణిజ్యలోటు రూ. 1.72 లక్షల కోట్లకు చేరుకున్నది.
అశోక మోదీ ప్రఖ్యాత ఆర్థికవేత్త. అమెరికాలోని ప్రిన్స్టన్ యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ ఎకనమిక్ పాలసీలో విజిటింగ్ ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్)లో విధులు నిర్వహించారు.
‘రెండో త్రైమాసికంలో జీడీపీ వృద్ధిరేటు 7.8 శాతంగా చెప్తున్నారు. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థగా భారత్ను అభివర్ణిస్తున్నారు. అయితే.. దేశంలో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. నిరుద్యోగం ఎన్నడూ చూడని స్థాయికి చేరింది. అయినప్పటికీ, జీడీపీ ఈ స్థాయిలో వృద్ధిరేటును నమోదు చేయడమేంటి? దీన్నిబట్టి జీడీపీ గణనలో లోటుపాట్లు ఉన్నట్టు అర్థమవుతున్నది’ అని అశోక్ మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు ‘ఇండియా ఫేక్ గ్రోత్ స్టోరీ’ పేరిట ‘ప్రాజెక్ట్ సిండికేట్’ వెబ్సైట్లో ఓ పరిశోధనాత్మక కథనాన్ని వెలువరించారు. జీడీపీ గణనలో అంతర్జాతీయంగా రెండు ప్రామాణిక పద్దతులను పాటిస్తారని ఆయన పేర్కొన్నారు. అందులో ఒకటి ఆర్థిక కార్యకలాపాలు (ఎకనమిక్ యాక్టివిటీ) కాగా, రెండోది వ్యయం (మార్కెట్ రేట్ల)కి సంబంధించినదని వివరించారు. సులభంగా చెప్పాలంటే ..
నిర్ణీత వ్యవధిలో జరిగిన మొత్తం ఉత్పాదకత, దానిపై ప్రజలు చేసిన వ్యయాన్ని పరిగణలోకి తీసుకొని ఆ రెండింటిని సగటు చేయగా వచ్చిందే జీడీపీ వృద్ధిరేటుగా భావించాలని ఆయన అన్నారు. ఈ లెక్కన ఎన్ఎస్వో గణాంకాలను లోతుగా విశ్లేషిస్తే.. ఉత్పాదకత 7.8 శాతం కాగా, వ్యయం 1.4 శాతంగా నమోదైనట్టు చెప్పారు. దీన్ని సగటుగా గణిస్తే, వృద్ధిరేటు 4.6 శాతం మాత్రమేనని వెల్లడించారు. కరోనా అనంతరం ఏప్రిల్-జూన్ 2022లో నమోదుచేసిన వృద్ధిరేటు 13.1 శాతంతో పోలిస్తే, ఇది చాలా తక్కువ అని వివరించారు. అయితే, ఎన్ఎస్వో కేవలం ఉత్పాదకతను మాత్రమే పరిగణలోకి తీసుకొని అదే పరిపూర్ణ జీడీపీగా చెప్పుకొచ్చిందని, అందులోనూ కొన్ని పొరపాట్లను గుర్తించినట్టు వెల్లడించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో లబ్ధిపొందడానికే బీజేపీ సర్కారు వృద్ధిరేటును తప్పుగా పెంచి చూపిస్తున్నదన్న విమర్శలు పెద్దయెత్తున వ్యక్తమవుతున్నాయి.