Gautham Adani | గౌతం అదానీ..పరిచయం అక్కర్లేని పేరు.. ప్రతి ఇంటా వెలుగులు విరజిమ్మే విద్యుత్ నుంచి నౌకాశ్రయాలు..విమానాశ్రయాలు.. గ్రాసరీ.. నిత్యావసర వస్తువుల రంగంలో వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్నారు. ఆనతి కాలంలోనే బిజినెస్లో సంచలనాలకు మారుపేరుగా నిలిచారు. ప్రస్తుతం ఆయన సరికొత్త రికార్డు నమోదు చేశారు. గౌతం అదానీ వ్యక్తిగత సంపద 123.7 బిలియన్ల డాలర్లు. ప్రపంచంలోనే అతిపెద్ద కుబేరుల్లో ఐదో స్థానానికి చేరుకున్నారు. అమెరికాలో ప్రముఖ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ను అధిగమించేశారని ఫోర్బ్స్ రియల్ టైం బిలియనీర్స్ ఇండెక్స్ తెలిపింది. ఫోర్బ్స్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం బెర్క్షైర్ హాత్వే చైర్మన్ వారెన్ బఫెట్ వ్యక్తిగత సంపద ప్రస్తుతం 121.7 బిలియన్ల డాలర్లు. భారత్లో అతిపెద్ద కుబేరుడిగా గౌతం అదానీ నిలిచారు.
ఇప్పుడు ప్రపంచంలో గౌతం అదానీ కంటే ఎక్కువ వ్యక్తిగత సంపద గల కుబేరులు నలుగురు మాత్రమే ఉన్నారు. మైక్రోసాఫ్ట్ కో-ఫౌండర్ బిల్గేట్స్ 130.2 బిలియన్ల డాలర్లు, బెర్నార్డ్ అర్నాల్ట్ 166.8 బిలియన్ల డాలర్లు, జెఫ్ బెజోస్ 170.2 బిలియన్ల డాలర్లు, ఎలన్మస్క్ 269.7 బిలియన్ల డాలర్లు. 123.7 బిలియన్ల డాలర్లతో గౌతం అదానీ.. భారత్లోనే నంబర్ వన్ కుబేరుడిగా రికార్డు సాధించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ వ్యక్తిగత సంపద 104.2 బిలియన్ల డాలర్లతో 8వ స్థానం నుంచి 9వ స్థానానికి పడిపోయారు.
బ్లూంబర్గ్ బిలియనీర్స్ లిస్ట్ ప్రకారం 119 బిలియన్ల డాలర్లతో గౌతం అదానీ ఆరో స్థానంలో ఉంటే 102 బిలియన్ల డాలర్లతో ముకేశ్ అంబానీ తొమ్మిదో కుబేరుడిగా ఉన్నారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు గౌతం అదానీ వ్యక్తిగత సంపద 43 బిలియన్ల డాలర్లు పెరిగింది. ఆయన పోర్ట్ ఫోలియో 56.2 శాతం పెరిగిందని బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ తెలిపింది. ఈ ఏడాది తొలి మూడు నెలల్లో అదానీ, ఆయన గ్రూప్ సంస్థల షేర్లు రికార్డు స్థాయిలో దూసుకెళ్లాయి. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా బిలియనీర్ల లిస్ట్లో పైపైకి దూసుకెళ్లారు.