ముంబై, మే 30: ప్రభుత్వరంగ సంస్థ గెయిల్ ఇండియా.. వచ్చే మూడేండ్లలో రెన్యూవబుల్ రంగం లో రూ.6 వేల కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నది. రెన్యూవబుల్ రంగంపై సంస్థ ప్రత్యేక దృష్టి సారించిందని, 2030 నాటికి ఈ రంగంలో రూ.20 వేల కోట్ల పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నట్లు గెయిల్ ఇండి యా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ మనోజ్ జైన్ తెలిపారు.
నిర్వహణ వ్యయం కింద వచ్చే ఐదేండ్లలో రూ.40 వేల కోట్లు ఖర్చు చేయాలనుకున్న సంస్థ..ఈ నిధులను రెన్యూవబుల్ ఎనర్జీ రంగంలో ఉన్న అవకాశాలకోసం ఖర్చు చేయనున్నట్లు చెప్పారు. ఈ నిధుల్లో రూ.20 వేల కోట్లను అంతర్గత వనరుల ద్వారా సేకరించనున్నట్లు, మిగతా రూ.20 వేల కోట్లను రుణంగా తీసుకోవాలనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. 2030 నాటికి 3 గిగావాట్ల రెన్యూవబుల్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న సంస్థకు అం దుకుతగ్గట్టుగా ప్రణాళికలను రచిస్తున్నట్లు చెప్పారు.
గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను సంస్థ పన్నులు చెల్లించిన తర్వాత లాభం 10,364 కోట్లు ఆర్జించింది. అంతక్రితం ఏడాదితో పోలిస్తే ఇది 112 శాతం అధికమని గెయిల్ డైరెక్టర్ రాకేశ్ కుమార్ జైన్ తెలిపారు. మరోవైపు, గడిచిన ఆర్థిక సంవత్సరంలో రూ.7,700 కోట్ల మేర పెట్టుబడులు పెట్టినట్లు, వీటిలో పెట్రోకెమికల్స్ వ్యాపారం కోసం అధికంగా ఖర్చు చేసినట్లు చెప్పారు.