Big blow for Future&Reliance |రిలయన్స్ రిటైల్లో విలీనం ద్వారా అప్పుల ఊబి నుంచి బయటపడాలన్న ఫ్యూచర్ రిటైల్ ఆశలు అడియాసలయ్యాయి. రిలయన్స్ కు రూ.24,713 కోట్ల విలువైన ఫ్యూచర్ రిటైల్ గ్రూప్ విక్రయానికి వ్యతిరేకంగా సింగపూర్ అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కోర్టు ఇచ్చిన అత్యవసర ఆదేశం ఆమోదయోగ్యమేనని శుక్రవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇక ముందు డీల్పై ముందుకెళ్లొద్దని రిలయన్స్, ఫ్యూచర్ సంస్థలను ఆదేశించింది.
గతేడాది ఆగస్టులో రిలయన్స్, ఫ్యూచర్ మధ్య ఒప్పందం విఫలమైతే.. ఫ్యూచర్ గ్రూప్పై ఆధారపడి జీవిస్తున్న 50 వేల మంది ఉద్యోగుల కుటుంబాల భవితవ్యం ప్రశ్నార్థకం అవుతుంది. అలాగే 6,000 చిన్న, మధ్య శ్రేణి వ్యాపారుల లావాదేవీలపైనా ప్రతికూల ప్రభావం పడుతుంది. దరిమిలా ఫ్యూచర్ గ్రూప్ మరింత ఆర్థిక సమస్యల్లో చిక్కుకునే సంకేతాలు కనిపిస్తున్నాయి.
సింగపూర్ మధ్యవర్తిత్వకోర్టు అత్యవసర ఆదేశాన్ని ధ్రువీకరిస్తూ సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలపై ఫ్యూచర్ సమీక్షాపిటిషన్ వేస్తుందని న్యాయ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫ్యూచర్ గ్రూప్తో అమెజాన్ ఒప్పందానికి సుప్రీంకోర్టు ఆదేశాలు వర్తించబోవని నిపుణుల అంచనా. ఆర్బిట్రేషన్ యాక్ట్లోని 37 (20) సెక్షన్ ప్రకారం ఈ పిటిషన్ దాఖలు చేస్తామని ఫ్యూచర్ రిటైల్ పేర్కొంది. రిలయన్స్తో డీల్పై ముందుకెళ్లేందుకు సింగపూర్ కోర్టు ఆదేశాల నుంచి ఢిల్లీ హైకోర్టు రిలీఫ్ ఇచ్చిందని గుర్తు చేసింది.
ఫ్యూచర్ రిటైల్, రిలయన్స్ మధ్య కుదిరిన ఒప్పందం చాలా ముఖ్యం అని ఫ్యూచర్ రిటైల్ పేర్కొంది. కేవలం స్టోర్లను మాత్రమే రిలయన్స్ టేకోవర్ చేయదని, అప్పులు, ఆస్తులను కూడా టేకోవర్ చేస్తుందని వివరించింది.
రిలయన్స్తో తమ డీల్పై ముందుకెళ్లేందుకు అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటామని ఫ్యూచర్ వివరించింది. తమ వాటాదారులు, ఉద్యోగుల ప్రయోజనాల పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నది. మరోవైపు సింగపూర్ మధ్యవర్తిత్వ కోర్టులో మధ్యంతర ఉత్తర్వులను ఉపసంహరించడానికి ఫ్యూచర్ గ్రూప్ ప్రయత్నిస్తున్నది. సింగపూర్ కోర్టులో ఫ్యూచర్-రిలయన్స్ న్యాయ పోరాటం కొనసాగే అవకాశాలున్నాయి.
ఫ్యూచర్ కూపన్స్లో అమెజాన్ ఇన్వెస్టర్. దీంతోపాటు ఫ్యూచర్ రిటైల్లోనూ వాటాదారే. 2019 ఆగస్టులో ఫ్యూచర్ అన్ లిస్టెడ్ ఫర్మ్ ఫ్యూచర్ కూపన్స్లో 49 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఫ్యూచర్స్ రిటైల్లో ఫ్యూచర్ కూపన్స్కు 7.3 శాతం వాటా ఉంటుంది. ఫ్యూచర్ కూపన్స్లో 49 శాతం వాటా కొనుగోలు ఒప్పందంలోనే భవిష్యత్లో అమ్మాల్సి వస్తే తమకే విక్రయించాలని పేర్కొన్నారు. మూడేండ్ల నుంచి 10 ఏండ్ల లోపు ఈ నిబంధన అమలులో ఉంటుంది.