న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్ చైర్మన్ కిశోర్ బియానీ జీతం గత ఆర్థిక సంవత్సరంలో 44 శాతం తగ్గింది. 2020-21లో బియానీ రూ.2.17 కోట్ల వార్షిక వేతనాన్నే అందుకున్నారు. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2019-20)లో రూ.3.86 కోట్లను బియానీ తీసుకున్నారు. ఈ మేరకు 2020-21కిగాను బుధవారం విడుదల చేసిన వార్షిక నివేదికలో ఫ్యూచర్ రిటైల్ తెలియజేసింది. సంస్థ ఎండీ రాకేశ్ బియానీ జీతం కూడా 4.82 శాతం దిగి రూ.3.75 కోట్లకు పరిమితమైంది. అంతకుముందు రూ.3.94 కోట్లుగా ఉన్నది. కాగా, 2020-21లో కరోనా ప్రభావంతో వ్యాపార కార్యకలాపాలు భారీగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గత ఆర్థిక సంవత్సరంలో కమిషన్ తీసుకోవద్దని సంస్థ నాన్-ఎగ్జిక్యూటివ్ స్వతంత్ర డైరెక్టర్లు స్వచ్ఛందంగా నిర్ణయించుకున్నారు.