న్యూఢిల్లీ: ముకేశ్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ రిటైల్లో ఫ్యూచర్ రిటైల్ విలీన ఒప్పందాన్ని నిలిపివేస్తూ సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ (ఎస్ఐఏసీ) జారీ చేసిన అత్యవసర మధ్యవర్తిత్వ ఆదేశాలు అమలు చేయాల్సిన అవసరం ఉందని ఆమెజాన్ వాదించింది. ఎస్ఐఏసీ అత్యవసర మధ్యంతర ఆదేశాలు చెల్లుబాటు అవుతాయని పేర్కొంది.
రిలయన్స్ రిటైల్లో ఫ్యూచర్ రిటైల్ విలీనానికి వ్యతిరేకంగా అమెజాన్ దాఖలు చేసిన పిటిషన్పై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. జస్టిస్లు ఆర్ఎఫ్ నారిమన్, బీఆర్ గవాయిలతో కూడిన ధర్మాసనం ముందు అమెజాన్ తరఫు న్యాయవాది గోపాల్ సుబ్రమణ్యం వాదించారు.
ఫ్యూచర్ రిటైల్-రిలయన్స్ రిటైల్ ఒప్పందానికి వ్యతిరేకంగా సింగపూర్ మధ్యవర్తిత్వ కోర్టు జారీ చేసిన మధ్యంతర అత్యవసర ఆదేశాలు, ఢిల్లీ హైకోర్టు సింగిల్ బెంచ్ మధ్యంతర ఉత్తర్వులు సరైనవేనని పేర్కొన్నారు. దీనిపై దాఖలైన వివిధ పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం లేదా వచ్చే మంగళవారం విచారణ జరుపనున్నది.
ఫ్యూచర్-రిలయన్స్ డీల్పై తుది ఆదేశాలు జారీ చేయొద్దని ఈ ఏడాది ఫిబ్రవరి 22న జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వుల్లో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)ని సుప్రీంకోర్టు ఆదేశించింది.