న్యూఢిల్లీ: గ్లోబల్ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్కు వ్యతిరేకంగా ఫ్యూచర్ రిటైల్ మళ్లీ సుప్రీంకోర్టు తలుపు తట్టింది. సింగపూర్ అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కోర్టు అత్యవసర ఆదేశాలను అమలు చేస్తే సంస్థలోని 35,575 మంది ఉద్యోగుల భవిష్యత్ ప్రశ్నార్థకం అవుతుందని ఫ్యూచర్ గ్రూప్ అధినేత కిశోర్ బియానీ సుప్రీంకోర్టులో శనివారం పిటిషన్ దాఖలు చేశారు.
రిలయన్స్ రిటైల్లో ఫ్యూచర్ రిటైల్ గ్రూప్ విలీనాన్ని వ్యతిరేకిస్తూ అమెజాన్ దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన సింగపూర్ అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కోర్టు గతేడాది అక్టోబర్లో జారీ చేసిన అత్యవసర ఆదేశాల్లో పేర్కొంది. భారత్లో సింగపూర్ కోర్టు ఆదేశాలు అమలవుతాయని ఇటీవల సుప్రీంకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. అంతే కాదు.. తమ ఆదేశాలపై దిగువ కోర్టుకు వెళ్లొద్దని ఫ్యూచర్ గ్రూప్ను హెచ్చరించింది.
సింగపూర్ మధ్యవర్తిత్వ కోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ సమీక్షా పిటిషన్ దాఖలు చేసింది ఫ్యూచర్ గ్రూప్. ఇది అత్యవసరంగా విచారించాల్సిన పిటిషన్ అని ఆ సంస్థ తరఫు న్యాయవాది యుగంధర పవార్ ఝా పేర్కొన్నారు. రిలయన్స్ రిటైల్లో ఫ్యూచర్ రిటైల్ విలీనం జరుగకపోతే రూ. 28 వేల కోట్ల బ్యాంకు రుణాలు, డిబెంచర్ల భవితవ్యం ప్రశ్నార్థకం అవుతుందన్నారు. తమ సంస్థకు ఊహించని నష్టం జరుగుతుందన్నారు. సుప్రీంకోర్టులో ఫ్యూచర్ గ్రూప్ సమీక్షా పిటిషన్ విషయమై అమెజాన్, ఫ్యూచర్ గ్రూప్ అధికార ప్రతినిధులు స్పందించడానికి నిరాకరించారు.