న్యూఢిల్లీ, మే 25: పరారీ వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ అదృశ్యమయ్యారు. ఆయన కోసం ఆంటిగ్వా అండ్ బార్బుడా పోలీసులు వెతుకుతున్నారు. సంచలనం సృష్టించిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) కుంభకోణం ప్రధాన నిందితుల్లో చోక్సీ ఒకరన్న విషయం తెలిసిందే. రూ.14వేల కోట్ల ఈ మోసం నేపథ్యంలో భారత్ నుంచి పారిపోయిన చోక్సీ.. 2018 నుంచి కరేబియన్ దేశంలోనే తలదాచుకుంటున్నారు. అయితే ఆదివారం నుంచి చోక్సీ కనిపించడం లేదని ఆయన లాయర్ విజయ్ అగర్వాల్ తెలిపారు. చివరిసారిగా అదేరోజు చోక్సీ తన కారులో వెళ్తున్నట్లు కనిపించారు. దీంతో ఆ కారును కనుగొన్న పోలీసులు.. అందులో ఆయన లేకపోవడంతో సెర్చింగ్ మొదలుపెట్టినట్లు సోమవారం రాత్రి చెప్పారు. ఇదే విషయాన్ని అగర్వాల్ సైతం ధ్రువీకరిస్తూ.. ఆయన క్షేమంపై కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు మంగళవారం పీటీఐకి తెలిపారు.
క్యూబాకు పారిపోయాడా..?
చోక్సీ క్యూబాకు పారిపోయాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చోక్సీ అప్పగింత కోసం ఆంటిగ్వాపై భారత్ ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలోనే పారిపోయినట్లు స్థానిక మీడియా సమాచారం. ఆదివారం కారులో ఓ విందుకు వెళ్లిన చోక్సీ.. అక్కడి నుంచి సముద్ర మార్గం గుండా క్యూబాకు జారుకున్నట్లు తెలుస్తున్నది. జోలీ హార్బర్ వద్ద చోక్సీ కారు పోలీసులకు లభించడం ఇందుకు బలం చేకూరుస్తున్నది. పీఎన్బీ కుంభకోణంలో చోక్సీతోపాటు ఆయన మేనల్లుడు, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ ప్రధాన నిందితులుగా ఉన్నారు. నీరవ్ లండన్లో పట్టుబడగా, భారత్కు అప్పగించే దిశగా మార్గం సుగమమైంది. ఆంటిగ్వాలో పెట్టుబడులు పెట్టి పౌరసత్వం పొందిన చోక్సీకి.. క్యూబాలోనూ ఆస్తులున్నట్లు వినిపిస్తున్నది. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తుండగా, చోక్సీపై ఇంటర్పోల్ రెడ్కార్నర్ నోటీసు కూడా ఉన్నది.