Wholesale Inflation | జూన్నెల ద్రవ్యోల్బణం రెండంకెల్లోనే నమోదైనా కాస్త రిలీఫ్నిచ్చింది. జూన్ టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) 15.18 శాతంగా నమోదైంది. గత మే నెల టోకు ద్రవ్యోల్బణం నాలుగు దశాబ్దాల గరిష్టం 15.88 శాతంగా, ఏప్రిల్ హోల్సేల్ ద్రవ్యోల్బణం 15.08, మార్చిలో 14.55, ఫిబ్రవరిలో 13.11 శాతంగా నమోదైన సంగతి తెలిసిందే. ఫుడ్, శీతల పానీయాలు అధిక ధరలు నమోదవుతున్నాయి. చమురు, ఇంధన ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. వరుసగా 15 నెల ద్రవ్యోల్బణం డబుల్ డిజిట్ నమోదు చేసింది.
ఆహార ద్రవ్యోల్బణం మే నెలతో పోలిస్తే జూన్లో 10.89 నుంచి 12.41 శాతానికి పెరిగింది. కూరగాయల ధరలు స్వల్పంగా 56.36 శాతం నుంచి 56.75% శాతానికి పెరిగాయి. కోడిగుడ్లు, మాంసం, చేపల ధరలు మాత్రం 7.78 శాతం నుంచి 7.24 శాతానికి దిగి వచ్చాయి. ఉల్లిగడ్డల ధరలు కూడా భారీగానే తగ్గాయి. మే నెలలో 31.54 శాతానికి పెరిగిన ఉల్లిగడ్డల ధరలు జూన్ నెలలో 20.40 శాతానికి దిగొచ్చాయి. మాన్యుఫాక్చరింగ్ ఉత్పత్తుల ధరలు 10.96 నుంచి 9.19 శాతానికి పడిపోయాయి. ఎల్పీజీ, పెట్రోల్, డీజిల్తోపాటు విద్యుత్ ధరలు 40.62 నుంచి 40.38 శాతానికి తగ్గుముఖం పట్టాయి.
హోల్సేల్ ధరల సూచీ నిరంతరంగా పెరిగిపోతూ ఉండటం ఆందోళన కలిగించే అంశమే. ఇది ఉత్పాదక రంగంపై అత్యధిక ప్రభావం చూపనున్నది. సుదీర్ఘకాలం టోకు ధరల సూచీ పైపైనే కొనసాగితే.. వివిధ వస్తువుల ఉత్పత్తిదారులు తమ ఉత్పత్తుల ధరలు పెంచితే వినియోగదారులపై భారం తడిసి మోపెడవుతుంది. ప్రభుత్వం పన్నుల్లో రాయితీలు కల్పించడం ద్వారా మాత్రమే ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి సాధ్యం అవుతుంది.