ISB | న్యూఢిల్లీ, మే 20: దేశవ్యాప్తంగా ఉన్న టాప్ బిజినెస్ స్కూళ్లలో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్బీ) తిరిగి తన తొలి స్థానాన్ని దక్కించుకున్నది. దేశీయంగా ఉన్న బిజినెస్ స్కూళ్లలో తొలి స్థానంతోపాటు ఆసియా వ్యాప్తంగా ఉన్న స్కూళ్లలో రెండో స్థానం లభించింది. ఫైనాన్షియల్ టైమ్స్ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్కస్టమ్ ర్యాంకింగ్ 2024 విడుదల చేసిన జాబితాలో ఈ విషయాన్ని వెల్లడించింది. రెండోస్థానం ఎమ్లియన్ బిజినెస్ స్కూల్కు లభించింది. ఆ తర్వాతి స్థానాల్లో యార్క్ యూనివర్సిటీ, ఇండియన్ ఇనిస్టిట్యూషన్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎం) బెంగళూరు, ఐఐఎం అహ్మదాబాద్, ఐఐఎం ఇండోర్లు ఉన్నాయి.
అంతర్జాతీయ బిజినెస్ స్కూళ్లలోనూ ఐఎస్బీ సత్తాచాటింది. గడిచిన సంవత్సరంలో 29వ స్థానంలో ఉన్న ఐఎస్బీ ర్యాంక్..ఈసారికిగాను మూడు స్థానాలు ఎగబాకి 26వ స్థానానికి చేరుకున్నది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్-100 బిజినెస్ స్కూళ్లకు ఈ ర్యాంకులు ఇచ్చినట్లు తెలిపింది. ముఖ్యంగా ఆయా బిజినెస్ స్కూళ్లు ఆఫర్ చేసే కోర్సులు, వ్యాపార వర్గాలు, కార్పొరేట్ క్లయింట్ల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ ర్యాంకులు ఇచ్చింది. కనీసంగా 10 క్లయింట్లు ఉన్న బిజినెస్ స్కూళ్ల పనితీరు ఆధారంగా ఈ ర్యాంక్లను ఇచ్చింది.
వాటిలో ఐదు క్లయింట్ల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ ర్యాంక్లు ఇచ్చింది. బోధన పద్దతులు, మెటీరియల్స్, డబ్బుకు ఇచ్చే విలువ, ప్రీపరేషన్, ప్రోగామ్ డిజైనింగ్, అంతర్జాతీయ క్లయింట్ల ముఖ్యమైన నిబంధనల గిటురాయిగా తీసుకున్నది. భారత్తోపాటు అంతర్జాతీయ స్థాయిలో ప్రభావాన్ని సృష్టించే వ్యాపారాలను నిర్మించడానికి, వృద్ధిచేయడానికి నిర్మించే ఎగ్జిక్యూటివ్లను ఐఎస్బీ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ తయారు చేస్తున్నది.
ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాలు, సమాజంలో పరివర్తనాత్మక మార్పు ను ప్రభావం చేయడానికి అవసరమైన జ్ఞానం, ప్రవర్తనలతో అభ్యాసకులను సన్నద్ధం చేయడంలో ఐఎస్బీ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ నిబద్ధత చాటుతున్నది. అధునాతన అభ్యాస బోధన విధానాలు, ప్రపంచ స్థాయి అధ్యాపకుల నైపుణ్యం, అత్యాధునిక పరిశోధన, అభ్యాసకుల కేంద్రీకృత ఫలితాలు సృష్టించడానికి మరింత ప్రయత్నిస్తాం.
– దీప మణి, ఐఎస్బీ డిప్యూటీ డీన్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ అండ్ డిజిటల్ లెర్నింగ్